Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Aug 2022 09:08 IST

1. నేడు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు.. రిజల్ట్స్‌ ఈనాడు.నెట్‌లో..

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాల ఫలితాలు శుక్రవారం ఉదయం 11.15 గంటలకు విడుదల కానున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. పాలిటెక్నిక్‌ పూర్తయిన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు నిర్వహించిన ఈసెట్‌ ర్యాంకులను మధ్యాహ్నం 12గంటలకు విడుదల చేస్తారని కన్వీనర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వాగు దాటి వైద్యం అందించి.!

ఏజెన్సీలోని మారుమూల గ్రామాల ప్రజలు వ్యాధుల బారిన పడకుండా వైద్య సిబ్బంది చూడాలని ఏజెన్సీ జిల్లా ఉపవైద్యాధికారి కుడ్మెత మనోహర్‌ సూచించారు. కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాలతో ఉట్నూరు మండలం జెండాగూడకు వెళ్లే మార్గంలో చెరువుగూడ సమీపాన ఉన్న వాగు నీటితో ప్రవహిస్తోంది. గురువారం ఆయన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయ్‌కుమార్‌, దంతనపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి అనురాధ వైద్య సిబ్బందితో కలిసి జెండాగూడకు వెళ్లే దారిలో ఉన్న వాగును తాడు సహాయంతో దాటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఉద్యోగాల పేరిట వల

3. నాడు 600 ఎకరాల ఆసామి.. నేడు కిరాయి ఇంట్లో వారసులు

భారత స్వాతంత్య్రోద్యమ గళం వినిపించి తెలంగాణ గాంధీగా గుర్తింపు పొందారు భూపతి కృష్ణమూర్తి. పూర్వ వరంగల్‌ జిల్లా ముల్కనూరులో జన్మించిన ఆయనకు వారసత్వంగా సంక్రమించిన దాదాపు 600 ఎకరాల భూమిని స్వాతంత్య్ర పోరాటానికి, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాలకు ధారాదత్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు, ఎన్టీఆర్‌ వరంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టికెట్లను ఇచ్చేందుకు ప్రయత్నించగా.. తృణప్రాయంగా వదులుకున్నారు. అలాంటి సమరయోధుడి కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో యాతన పడుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గోదారమ్మ కన్నెర్ర

గత నెలలో మహోగ్రరూపం చూపిన గోదావరి మళ్లీ కన్నెర్రజేసింది. నెల తిరగకముందే రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరడంతో లోతట్టు ప్రాంతాల్లో.. లంక గ్రామాల్లో ఆందోళన మొదలైంది. రోజులుగా ముంపుతో అవస్థలు పడిన జనం.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడి కోలుకుంటున్న తరుణంలో ఎగువన వర్షాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాజా పరిస్థితిపై విపత్తుల నిర్వహణ సంస్థ యంత్రాంగాన్ని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ముద్ర పడలేదా.. డొక్క మాడిందే!

5. డిజైన్‌ మారిందా?

డిజైన్‌లో చేసిన మార్పు వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం పంపుహౌస్‌ నీట మునిగిందా అన్నది నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పంపుహౌస్‌ మెయింటెనెన్స్‌ బే(నిర్వహణ ప్రాంతం) మొదట ఆమోదించిన డిజైన్‌ ప్రకారం 132 మీటర్లు. అంటే అంతవరకు కాంక్రీటు పని చేయాలి. తర్వాత మార్పు చేసి 124 మీటర్లకు తగ్గించారు. దీంతోపాటు మోటార్లు, స్విచ్‌గేర్‌లు ఇలా అన్నింటి మెయింటెనెన్స్‌ బేల మట్టాలు తగ్గిపోయాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 32 నెలలుగా వేతనాల్లేవ్‌

విద్యతోనే అభివృద్ధి సాధ్యం. దానిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంతోమంది పిల్లలు ఆశ్రయం పొందుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఓ మంచి లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినా,  విధానపరమైన లోపాలతో కొన్ని సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్న పిల్లలకు అన్నం, కూరలు వండే కుక్‌లు, వంటకు సాయం చేయడం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వీరుడు.. నేతాజీకి చేదోడు

‘మీరు రక్తాన్ని ఇవ్వండి. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను..’ ‘స్వేచ్ఛ ఎవ్వరూ ఇవ్వరు. మనకు మనమే తీసుకోవాలి..’ అనే ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి అయిన నేతాజీ నినాదాలు ఆ యువకుడిని ఎంతగానో ఆకర్షించాయి. బ్రిటిష్‌ సైన్యంలో చేరాలనుకున్న తన లక్ష్యాన్ని మార్చుకున్నారు. దేశ మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నేతాజీ మార్గదర్శనంలో ముందుకు నడిచారు. యుద్ధ సమయంలో బ్రిటిష్‌ సైన్యం చేతికి చిక్కి జైలు జీవితాన్ని అనుభవించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆ దంపతులు చైతన్య దీప్తులు

8. ఇసుక కొనలేం బాబోయ్‌..!

గోదావరి వరదలకు ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టన్ను ఇసుక ధర రూ.475గా ఉండేది. ప్రస్తుతం స్టాక్‌ యార్డుల నుంచే అవసరమైన ఇసుక తీసుకోవాలి. ఇక్కడ గతంలో టన్ను రూ.625 ఉండగా ప్రస్తుతం రూ.850కు పెంచి విక్రయిస్తున్నారు. ఇసుక టన్ను రూ.677 అని బోర్డులు మాత్రం యార్డుల వద్ద కనిపిస్తాయి. దీంతోపాటు లారీ కిరాయిలను పెంచారు. ఉమ్మడి జిల్లాలో రావులపాలెం, గండేపల్లి, లాలాచెరువు, కాతేరు, ఆలమూరు, బోడసుకుర్రురేవు, పెద్దాపురం, రాచపల్లి తదితర ప్రాంతాల్లో స్టాకు యార్డులు ఏర్పాటుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నేటి నుంచి పలు రైళ్ల రద్దు.. దారి మళ్లింపు

గుంతకల్‌ డివిజన్‌లో నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల దృష్ట్యా పలు రైళ్ల రద్దు.. దారి మళ్లింపు చేపట్టినట్లు విజయవాడ రైల్వే అధికారులు గురువారం తెలిపారు. * రైలు నంబరు 17215/17216 విజయవాడ-ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు గుత్తి-ధర్మవరం మధ్య తాత్కాలికంగా రద్దు. * నంబరు 07693/07694 గుంతకల్‌-హిందూపురం డెము ప్యాసింజరు రైలు ఈ నెల 12 నుంచి 20వరకు పూర్తిగా రద్దు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సింహాచలంలో అపచారం!

సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో చందనంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేసే సమయంలో అర్చకుడు ముఖానికి వస్త్రం చుట్టుకోక పోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం జరిగే కరాళ చందన సమర్పణ నేపథ్యంలో సిబ్బంది అరగదీసిన చందనంలో అర్చకులు గురువారం సుగంధ ద్రవ్యాలు మిళితం చేశారు. ఆ ప్రక్రియ జరుగుతున్న సమయంలో దేవస్థానం సిబ్బంది వీడియో తీస్తుండగా సంబంధిత అర్చకుడు మాట్లాడడంపై విమర్శలు తలెత్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని