Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Sep 2022 09:07 IST

1. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం ప్రారంభించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు స్పందన కొరవడటంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్లాట్‌లో 60% భూమి విలువపైనే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు సంబంధించిన కొన్ని లేఅవుట్లలో స్థలాల కొనుగోలుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో కొనుగోలుదారులను ఆకర్షించడానికి తీసుకున్న తాజా నిర్ణయాన్ని జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకూ వర్తింపజేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చికెన్ వ్యర్థం కోట్లు పలుకుతోంది

చికెన్‌ వ్యర్థాల వ్యాపారం రూ.కోట్లు కురిపిస్తోంది. దీనిని నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొస్తే ఆదాయం సమకూరుతుందని ఇటీవల జరిగిన నగర పాలకవర్గ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ సిద్ధారెడ్డి రేణుక ప్రస్తావించారు. ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ‘న్యూస్‌టుడే’ ఆరా తీయగా చికెన్‌ వ్యర్థాలు  చేపల చెరువుల్లో వేయడంతోపాటు మరికొన్నింటిలో వాడుతున్నట్లు తెలుస్తోంది. డిమాండ్‌ పెరగడంతో దీన్ని కొందరు వ్యాపారంగా మార్చుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉప్పల్‌ తిప్పల్‌.. కూర్చోలేరు, నిలబడలేరు!

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ ఆదివారమే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. టికెట్ల విషయంలో గందరగోళం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 20 మంది అభిమానులు గాయపడిన సంగతి తెలిసిందే.. ఈ మ్యాచ్‌ను నెలరోజుల కిందటే ఖరారు చేసినా స్టేడియంలో పనులు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్టున్నాయి. ప్రేక్షకులు కూర్చునేందుకు వీల్లేకుండా అక్కడక్కడ కుర్చీలు విరిగి పడిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రూ.3 లక్షల ముచ్చటేది!

సొంత జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం కోసం ప్రజలు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాకే కొత్త పథకానికి అడుగులు ముందుకు పడతాయి. సొంత స్థలం ఉన్న అర్హులకు ఇల్లు కట్టుకునేందుకు రూ.అయిదు లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు గత సంవత్సరం బడ్జెట్‌ సమయంలోనే ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విజయ పాల ప్యాకెట్ల ధర పెంపు

ఈనెల 26 నుంచి విజయ పాల ప్యాకెట్ల ధర పెంచాలని నిర్ణయించినట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఎండీ కొల్లి ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. పాల ఉత్పత్తిదారులకు చెల్లించే సేకరణ ధర, డీజిల్‌, రవాణా ఖర్చులు పెరిగినందున ధరలు సవరించినట్లు పేర్కొన్నారు. విజయ లోఫ్యాట్‌ రూ.26, ఎకానమీ రూ.28, స్పెషల్‌ రూ.34, విజయ గోల్డ్‌ రూ.35గా నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇక మార్కెట్‌లో వృథా నీటి ట్రేడింగ్‌..

వృథాగా వెళ్లే నీటిని మార్కెట్‌లో వినియోగ వస్తువుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంబంధిత విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్‌ కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌ల్లో బంగారం, వెండి, ముడిచమురును విక్రయిస్తున్నట్లుగానే.. వృథా నీటి వ్యాపారం కూడా ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చే పనికి నీతి ఆయోగ్‌ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ విధానం ఉండగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాజకీయ కారణాలతో మోదీని కొందరు అపార్థం చేసుకుంటున్నారు

రాజకీయ కారణాలతో కొందరు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను అపార్థం చేసుకుంటున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కానీ ప్రధానికి దేశమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడి ఆకాశవాణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌, కేరళ గవర్నర్‌ ఆరీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌లతో కలిసి మోదీ 2019 మే నుంచి 2020 మే మధ్యకాలంలో చేసిన 86 ఎంపిక చేసిన ప్రసంగాలతో ముద్రించిన ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌’ పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టెలికాం సేవలకు తప్పుడు వివరాలిస్తే ఏడాది జైలు

టెలికాం నూతన బిల్లును వచ్చే 6-10 నెలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు. ఈ బిల్లును ప్రవేశపెట్టే విషయంలో ప్రభుత్వానికి తొందరేమీ లేదని అన్నారు. ‘గురువారం విడుదల చేసింది ప్రాథమిక ముసాయిదానే. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా తుది ముసాయిదా రూపొందిస్తాం. దానిని పార్లమెంటు కమిటీకీ పంపిస్తాం. ఆ తర్వాత పార్లమెంటులో ప్రవేశపెడతాం. ఇందుకు 6-10 నెలల సమయం పడుతుందని అనుకుంటున్నాన’ని మంత్రి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆవు పాలతో కోట్ల వ్యాపారం

తన కూతురి అనారోగ్యానికి కారణం కల్తీ పాలని తెలుసుకుంది. పాపకు స్వచ్ఛమైన పాలను అందించాలనుకుంది. కానీ ఆమెలోని తల్లి మనసు అక్కడితో ఆగలేదు. నా కూతురు సరే మిగిలిన పసి పిల్లలో అనుకుంది. అదే ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. నాలుగేళ్లలో కోట్ల వార్షికాదాయాన్ని అందుకునే స్థాయికి చేర్చింది. పైగా ఎందరో రైతులకు, గ్రామీణులకు ఉపాధినీ కల్పిస్తున్న రూపాలీ కకాడే స్ఫూర్తి ప్రయాణమిది... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తప్పకనే దసరా ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు

ప్రతిఏటా పండుగ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీ వసూలు చేస్తున్నామనే అప్రతిష్ఠను తొలగించుకునేందుకు.. తొలిసారిగా దసరా కోసం వేసే ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ప్రజలపై భారం లేకుండా చూసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గొప్పగా చెప్పింది. అయితే వాస్తవం మరోలా ఉంది. తప్పనిసరై మరో మార్గంలేక సాధారణ ఛార్జీలు వసూలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని