Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. రావణ దహనంలో మారణహోమమే లక్ష్యం?
2005 అక్టోబరు 12, బుధవారం, విజయదశమి. సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ కార్యాలయంపై బంగ్లాదేశ్కు చెందిన డాలిన్ ఆత్మాహుతి దాడి. ఆ సమయంలో పోలీసులు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. విధుల్లో ఉన్న హోంగార్డు సహా డాలిన్ మరణించాడు. ఈ దాడికి పథకం పాకిస్తాన్ నుంచే జరిగింది. డాలిన్కు సాయం చేసిన వారి జాబితాలో మూసారాంబాగ్కు చెందిన అబ్దుల్ జాహెద్ అరెస్టయ్యాడు. 2022 అక్టోబరు 5, బుధవారం, విజయదశమి. భారీగా ప్రాణనష్టం లక్ష్యం. ఇదే పట్టుబడిన ముగ్గురు ఉగ్రమూకల పథకం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఎనిమిదో తరగతి విద్యార్థులకు లక్ష స్కాలర్షిప్పులు
మీరు ఎనిమిదో తరగతి విద్యార్థులా? ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా? అయితే మీ కోసం లక్ష స్కాలర్షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. ఎంపికైనవారికి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లపాటు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున అందిస్తారు. పరీక్షలో చూపిన ప్రతిభతో ఈ ప్రోత్సాహాలు సొంతమవుతాయి. ప్రకటన వెలువడిన నేపథ్యంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్పులు 2022-23 పూర్తి వివరాలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. దసపల్లా భూములు ప్రభుత్వానివే
దసపల్లా భూములు కచ్చితంగా ప్రభుత్వానివేనని విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టంచేశారు. వాటిని దక్కించుకునేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తుండగా, ఈ నాటికి నెరవేరుతున్నాయన్నారు. ‘ఇప్పటికైనా మించిపోలేదు. ఈ భూములకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, మోసం ఎక్కడ జరిగిందో తెలుసుకుని న్యాయస్థానంలో నిరూపించగలిగితే ప్రభుత్వానికే విజయం లభిస్తుంది’ అని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఆ కళాశాలల్లో ఫీజులు పెరుగుతాయ్!
తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) గత నెలలో ఖరారు చేసిన బీటెక్ ఫీజులను అంగీకరించని కళాశాలల్లో రుసుములు మారనున్నాయి. విచారణకు హాజరై అభ్యంతరాలను వ్యక్తంచేసి, అవసరమైన ఆధారాలను చూపిన కళాశాలల ఫీజుల మొత్తం కొంత పెరగనుంది. ఫలితంగా కొద్ది నెలలుగా సాగుతున్న ఫీజుల వ్యవహారం కొలిక్కి వచ్చినట్లయింది. గత నెల 24న రెండోసారి విచారణ జరిపిన టీఏఎఫ్ఆర్సీ ఫీజులను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 173 ఇంజినీరింగ్ కళాశాలల్లో 20 ఈ మొత్తాలను అంగీకరించలేదు. అందులో సీబీఐటీ, నారాయణమ్మ.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. దసరా, ఆ తర్వాతి రోజు భారీ వర్షాలు
బంగాళాఖాతం పశ్చిమ మధ్య ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ అల్పపీడనం దసరా (బుధవారం) నాటికి ఏపీ తీరం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఓ మోస్తరుగా.. బుధ, గురువారాల్లో భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రైట్ చెప్పాలంటే గుంత పూడ్చాల్సిందే!
ఆ రోడ్డులో పలుచోట్ల పెద్ద పెద్ద గోతులున్నాయి. అప్రమత్తంగా లేకుంటే ఒళ్లు హూనం కావడంతోపాటు వాహన చక్రాలు ఎక్కడ ఊడిపోతాయో తెలియని పరిస్థితి. దీంతో ప్రజా రవాణా శాఖ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో డ్రైవరు బి.ఎ.నాయుడు, కండక్టరు ఆర్.ఎస్. ప్రసాద్ బండరాళ్లను బస్సులో తీసుకువచ్చి గోతుల్లో వేసి రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం - తాండవ మార్గంలో ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవరు, కండక్టర్ రాళ్లను గోతుల్లో వేయడాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోమవారం సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఈ శునకం.. ఖరీదులో ‘కనకం’..
దసరా వేడుకల్లో భాగంగా కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం రాష్ట్ర స్థాయి పెంపుడు జంతువుల ప్రదర్శన జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు పోటీల్లో పాల్గొన్నారు. 22 జాతుల శునకాలతో వాటి యజమానులు వచ్చారు. బెంగళూరుకు చెందిన వ్యాపారి, జాగిలాల ప్రియుడు ‘కడబం’ సతీశ్ తీసుకొచ్చిన టిబెటియన్ మస్టిఫ్ జాతి జాగిలం ‘భీమ’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ.10 కోట్లు ఖర్చు చేసి, గత ఏడాది చైనాలోని బీజింగ్ నుంచి ప్రత్యేక విమానంలో భీమను తెప్పించినట్లు ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ‘గాడ్ ఫాదర్’లో పది సర్ప్రైజ్లు!
‘హనుమాన్ జంక్షన్’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు మోహన్రాజా. 21 ఏళ్ల విరామం తర్వాత ‘గాడ్ఫాదర్’తో తిరిగి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మలయాళంలో విజయవంతమైన ‘లూసీఫర్’కు ఇది రీమేక్. సల్మాన్ఖాన్, నయనతార, సత్యదేవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బుధవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు మోహన్రాజా. ఆ విశేషాలివి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పల్లె గళం.. పార్లమెంటులో!
నలుగురిలో మాట్లాడాలంటేనే చాలా మందికి బిడియం. అలాంటిది డిగ్రీ అమ్మాయి.. దేశ పార్లమెంట్లో ప్రసంగించడమంటే మాటలా! మిద్దె రూప ఆ అవకాశాన్ని దక్కించుకుంది. ఆ అవకాశం ఎలా వచ్చింది.. అక్కడేం మాట్లాడిందన్న అంశాల్ని వసుంధరతో పంచుకుందిలా.. నేను ఎనిమిదో తరగతిలో ఉండగా.. ‘అమ్మాయిలైతేనేం.. వాళ్లూ బాగా చదువుకుని పేరు తెస్తారు’ అని బంధువులతో నాన్న చెప్పడం విన్నా. అప్పటివరకూ నాకెలాంటి లక్ష్యాల్లేవ్. నాన్న మాటలు విన్నాక నాలో మార్పు వచ్చింది. మాది వైఎస్సార్ కడప జిల్లా టి.కోడూరు. నాన్న సత్యనారాయణ, అమ్మ రమాదేవి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. వాట్సప్లో మెట్రోరైల్ టిక్కెట్లు
మెట్రోరైల్ ప్రయాణికులు ఇకపై వాట్సప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రోరైల్ కౌంటర్లలో టిక్కెట్లు కొనేందుకు వరుసలో నిల్చోవాల్సిన అవసరం లేదని వివరించారు. వాట్సప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో నగదు బదిలీ చేయవచ్చని, దేశంలోనే తొలిసారిగా తాము ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందుకోసం బిల్ఈజీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.