Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Nov 2022 09:05 IST

1. ఆ 5 తాగించండి

 ‘ఆ అయిదు’ బ్రాండ్ల విక్రయాలు పెంచాలంటూ ఉన్నత స్థాయి నుంచి వస్తున్న ఆదేశాలు మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారులను ఆందోళన కలిగిస్తోంది. ‘‘ ఇటీవల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి.. వాటిపై మందుబాబులు విముఖత చూపుతున్నారు.. ఏం చేయాలో అర్థం కావడం లేదని ’’ ఓ అధికారి వాపోయారు. ఆ అయిదు బ్రాండ్లు అధికార పార్టీ నేతలకు చెందిన కంపెనీల నుంచి వెలువడుతున్నాయి. వాటి విక్రయాలు పెంచడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. మద్యం దుకాణాలు, బార్ల నిర్వాహకులకు బలవంతంగా కట్టబెడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అగ్గిపెట్టె ఇవ్వలేదని హత్య

బీడీ వెలిగించుకునేందుకు అగ్గిపెట్టె ఇవ్వలేదని వృద్ధుడ్ని ఓ వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్వీయూ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తిరుపతి పడమర డీఎస్పీ నరసప్ప వెల్లడించారు. ‘ఈ నెల 15న రాత్రి మహిళా వర్సిటీ బస్‌షెల్టర్‌లో గుర్తుతెలియని వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఆధారాల ప్రకారం విజయవాడకు చెందిన రేపాకుల లక్ష్మణరావు(70)గా గుర్తించారు. భార్య పిల్లలను వదిలేసి తిరుపతిలో భిక్షాటన చేస్తూ ఊరికి వెళ్లి వస్తుంటాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మరిచేదెలా.. మది నిలిచేదెలా!

వేల ఆశీస్సులు.. వందల ఆపన్న హస్తాల అండదండలూ ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడలేకపోయాయి. మూడేళ్ల వయసులోనే నూరేళ్లు నిండాయి.. కన్నా.. అని పిలిస్తే బుడిబుడి అడుగులతో.. గలగల నవ్వులతో నడిచొచ్చే ఆ చిన్నారి దర్శిత్‌.. ఇక రాడని.. లేడని తెలిసిన ఆ కన్నపేగు విలవిల్లాడుతోంది. విద్యుదాఘాతానికి గురై.. 14 రోజులుగా కాకినాడ సామాన్య వైద్యశాలలో మృత్యువుతో పోరాడిన దర్శిత్‌ శుక్రవారం సాయంత్రం ఊపిరి వదిలాడు.. ప్రమాదంలో రెండు కాళ్లూ తొలగించినా.. ఉలుకూ పలుకూ లేకున్నా.. ఆ శ్వాసలో.. కన్నీటి సుడుల్లో.. అమ్మ- నాన్నల ఊసులే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భూ హక్కు పత్రం.. తప్పుల మయం

మ్మడి జిల్లాలో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు-భూరక్ష పథకం ముందుకు సాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సర్వే పూర్తైనా ఇప్పటివరకు హక్కు పత్రాలు అందలేదు. వచ్చిన వాటిలో తప్పులు ఉండటంతో తిరిగి వెనక్కి పంపాల్సిన పరిస్థితి నెలకొంది. 2020 డిసెంబరు 21న కల్లూరు మండలం పందిపాడులో పైలెట్‌ ప్రాజెక్టు కింద భూముల రీసర్వే చేపట్టారు. సర్వే పూర్తి చేశారు. ఈ గ్రామంలో ఏడు వందల సర్వే నంబర్లు ఉండగా 520 ఎల్‌పీఎం నంబర్లు ఉన్నాయి. సుమారు 326 ఖాతాలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రైలులో సీటు దొరకడం గగనమే..!

రిజర్వేషన్‌ లేని, జరిమానా విధించిన పత్రాలతో వేలాది మంది ప్రయాణిస్తుండటంతో విశాఖ వచ్చే సరికి ఇక్కడి ప్రయాణికులు బోగీల్లో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైలు గంటల తరబడి స్టేషన్‌లో నిలిచిపోతోంది. చివరికి అధికారులు రిజర్వేషన్‌ లేని, జరిమానా విధించిన వారిని కిందికి దించేయాల్సి వస్తోంది. ఇటీవల విశాఖ, అనకాపల్లి, ఎలమంచిలి స్టేషన్లలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. స్లీపర్‌ బోగీల్లో భారీగా కోత విధించడమే దీనికి కారణమని తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బురద దాటితేనే బడికి!!

రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులున్న పాఠశాలల్లో చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఒకటి. అలాంటిచోట పరిస్థితిని పై చిత్రంలో చూడొచ్చు. శుక్రవారం వర్షానికి క్రీడామైదానం బురదమయమైంది. విద్యార్థులు తరగతి గదులకు వెళ్లేందుకు  ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమస్యపై పలుమార్లు ‘ఈనాడు’లో కథనాలు ప్రచురించడంతో ఎమ్మెల్యే ముత్తంశెట్టి స్పందించారు. క్రీడామైదానం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జ్వరం.. శరీరంపై పగుళ్లా.. జాగ్రత్త సుమా!

చలికాలం.. వ్యాధులు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరంతోపాటు ఆస్తమా.. న్యుమోనియా లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరిలో శరీరంపై ఎర్రటి పొక్కులు, పగుళ్లూ వస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇవే లక్షణాలతో గడిచిన నెల రోజుల్లో 15-20 మంది పిల్లలు గాంధీలో చేరినట్లు వైద్యులు తెలిపారు. చికిత్సలతో అందరూ కోలుకున్నారన్నారు. ‘ఈ కాలంలో ప్రధానంగా శ్వాసకోశ వ్యాధులైన న్యుమోనియా, సీవోపీడీ, ఆస్తమా ఇబ్బంది పెడుతుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అవే పనులు.. మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు

 కాకినాడ యాంకరేజి పోర్టు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అయితే, సాగరమాల ప్రాజెక్టు కింద మంజూరైన ఈ పనులకు రెండుసార్లు శంకుస్థాపనలు చేయడం చర్చనీయాంశమైంది. ఇక్కడ రూ.91.185 కోట్లతో పనులు చేపట్టడానికి పరిపాలనామోదం ఇచ్చారు. దీనిలో అంచనా విలువ రూ.73.42 కోట్లుగా పేర్కొన్నారు. ఒప్పంద విలువ రూ.73.34 కోట్లుగా చూపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఓ ముఖ్య కార్యదర్శి నడకోపాఖ్యానం.. ప్రవీణ్‌ప్రకాశ్‌ రూటే సెపరేటు

జంధ్యాల ‘చూపులు కలిసిన శుభవేళ’ సినిమాలో మైళ్లకు మైళ్లు వాహ్యాళిగా నడుస్తూ.. తనతోపాటు ఇతరులనూ బలవంతంగా నడిపిస్తుండే సుత్తి వీరభద్రరావు ‘గుండు పాండురంగారావు’ పాత్ర గుర్తుండే ఉంటుంది చాలామందికి.. రాష్ట్ర సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి తీరు కూడా ఇలాగే ఉంది. కొత్తగా వచ్చిన ఆ ముఖ్య కార్యదర్శి సచివాలయంలోని తన ఛాంబర్‌లో కంటే పార్కులోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. అక్కడే నడుస్తూ.. వివిధ దస్త్రాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టెంకాయ పిలకలా మారిన రుషికొండ

 రుషికొండ పర్యావరణంపైనా, ప్రకృతిపైనా అత్యాచారం చేసిన ఘనత వైకాపా నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. కొండను తొలిచి రాష్ట్రప్రభుత్వం ప్రకృతి విధ్వంసానికి పాల్పడిందన్నారు. ‘అందచందాలతో, భోగభాగ్యాలతో కూడిన రిసార్టులు నిర్మించినా సహజసిద్ధమైన రుషికొండను తేగలమా? ఎన్ని వేలకోట్లు ఖర్చుపెట్టినా సహజసిద్ధమైన రుషికొండ మళ్లీ సాధ్యం కాదు. రుషికొండ లేకుండా విశాఖకు అందం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని