Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Feb 2023 09:11 IST

1. ‘గడప గడపకు’ కార్యక్రమానికి వాళ్లను రానివ్వకండి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ‘న్యూస్‌టుడే’ ప్రతినిధిపై ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చిందులు తొక్కారు. ప్రైజర్‌పేటలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ‘సమస్యలు చెబుతుంటే పట్టించుకోరా?’ అనే శీర్షికన గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తపై వెలంపల్లి.. ‘ఏమయ్యా మమ్మల్ని నిలదీశారని రాశావు. ఎక్కడ నిలదీశారు? కుక్కల సమస్యపై అడిగితే నిలదీయడమా’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ ప్రతినిధి స్పందిస్తూ కుక్కలు, కాలువలు, చెత్త, విద్యుత్తు దీపాలు, రిటైనింగ్‌ గోడ గురించి మహిళ అడిగారని, ఆ విషయాలే రాశామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 1,553 జేఎల్‌ఎం పోస్టుల భర్తీ

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) 1,601 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ)ఎలక్ట్రికల్‌, 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టులు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలకు ఫిబ్రవరి 15 తర్వాత సంస్థ వెబ్‌సైట్‌లో చూడాలని ఎస్పీడీసీఎల్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అడ్డొస్తే అంతమే

 గ్రామాల్లోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను తమవైపు రావాలని బెదిరించటం.. వినకపోతే వారిపై అక్రమ కేసులు బనాయించడం.. అప్పటికీ లొంగకపోతే దాడులు, హత్యలు చేసే విష సంస్కృతి పల్నాడు జిల్లాలో గత మూడున్నరేళ్లుగా అమలవుతోంది. తమ ఆధిపత్యానికి అడ్డుగా ఉంటున్నారనుకున్న వారిని వైకాపా కార్యకర్తలు అంతమొందిస్తున్నారు. వీరికి ఆ పార్టీ మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల అండదండలు ఉంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇనుప చువ్వలు.. సిమెంటు బస్తాలు ఎత్తుకుపోతున్నారు..

విజయవాడ మండలం నున్న జగనన్న కాలనీల్లో దొంగల బెడద ఎక్కువైంది. ఇంటి నిర్మాణం కోసం పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇనుప చువ్వలు, సిమెంటు బస్తాలను రాత్రివేళ దొంగలు ఎత్తుకుపోతున్నారు. ఇసుక, కంకరనూ వదలడం లేదు. నున్న గ్రామానికి  7 కిలోమీటర్ల దూరంలో ఊరి చివరన పొలాల మధ్యన లేఅవుట్‌ ఉండటంతో ఏ మాత్రం రక్షణ లేని పరిస్థితి. రామవరప్పాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, గూడవల్లి గ్రామాల లబ్ధిదారులకు ఇక్కడ జగనన్న ఇళ్ల స్థలాలను కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గర్భిణులకు ఉచితంగా టిఫా స్కానింగ్‌

తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా గర్భిణులకు కొత్తగా ఉచితంగా ‘టిఫా’ (టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ ఎనామలిటీస్‌) స్కానింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఈ స్కానింగ్‌ ద్వారా గర్భస్థ శిశువుల లోపాలను గుర్తించి, ముందుగానే జాగ్రత్తపడేందుకు వీలవుతుందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో రేడియాలజిస్టులు ఉన్నచోట ఈ టిఫా స్కానింగ్‌ సేవలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చెస్‌లో ఎత్తుగడలపై వాయు కాలుష్యం దెబ్బ!

వ్యక్తుల మేధో సామర్థ్యాలపై వాయు కాలుష్యం ప్రతికూల ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెస్‌ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో తమ సత్తా చాటలేకపోతుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. జర్మనీలో 2017, 2018, 2019ల్లో నిర్వహించిన ఓ చెస్‌ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆటగాళ్లు వేసిన ఎత్తులను అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు కంప్యూటర్‌ సాయంతో విశ్లేషించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘అబ్బే ఆడదండీ’ అన్నవారంతా అవాక్కయ్యారు!

తెలుగు సినీ చరిత్రలో ‘శంకరాభరణం’ (sankarabharanam)ఒక ఆణిముత్యం. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా, ఎన్ని పేరాలు రాసినా తనివి తీరదు.  అప్పట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య సినిమాలపై చర్చ వస్తే, ఎదుటి వ్యక్తికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘శంకరాభరణం ఎన్నిసార్లు చూశారు?’. అప్పట్లో ఈ సినిమా ఎన్నిసార్లు చూస్తే అంతగొప్ప. ఇక అవార్డు, రివార్డులు ‘శంకరశాస్త్రి’ పాదాక్రాంతమయ్యాయి. అలాంటి గొప్ప చిత్రాన్ని మనకు అందించి ఆ సినిమా విడుదలైన రోజే దర్శకుడు కె.విశ్వనాథ్‌ శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇళ్లివ్వకుండానే వడ్డీలు.. వాయిదాలు

పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు, బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు మాత్రం అందుతున్నాయి. చేతిలో ఇంటి పట్టాలు పెట్టినా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయలు కల్పించకపోవడంతో సొంతింటి గుమ్మంలో అప్పుడే అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఈలోపు ఇళ్ల కోసం తీసుకున్న రుణాలకు సంబంధించి వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకుల ఒత్తిళ్లు ఓవైపు.. అప్పుచేసి కట్టిన వాటా సొమ్ముపై పెరుగుతున్న వడ్డీల భారం లబ్ధిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!

ఓ వ్యక్తి ఏకంగా 12 మందిని వివాహం చేసుకుని 102 మంది పిల్లలను కనేశాడు. ఇక పిల్లలు వద్దు బాబోయ్‌ అంటున్నాడు. ఉగాండాలోని బుగిసాలో నివసిస్తున్న అతడి పేరు ముసా హసహ్య. ఆయనకు రెండెకరాల భూమి ఉంది. వంద మందికిపైగా ఉన్న కుటుంబ సభ్యులకు సరిపోయే ఆహారం, దుస్తులు వంటివి సమాకూర్చలేకపోతున్నాడు. దీంతో విసుగు చెందిన ఇద్దరు భార్యలు ఇటీవలే అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అంత్యక్రియలకు ముందు కళ్లు తెరిచిన 109 ఏళ్ల బామ్మ

మరణించిందనుకున్న 109 ఏళ్ల బామ్మ 7 గంటల తర్వాత లేచి కూర్చోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నర్సన్‌ ఖుర్ద్‌ గ్రామానికి చెందిన జ్ఞాన్‌ దేవి అనే వృద్ధురాలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రిలో చేర్పించగా ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు. శ్మశానవాటికకు తీసుకెళ్లే కొన్ని నిమిషాల ముందు వృద్ధురాలి శరీరంలో చలనం కనిపించడంతో వారు ఆమెను కదిలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని