Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Mar 2023 13:34 IST

1. వంశధార.. కన్నీటి చార!

శ్రీకాకుళం జిల్లాకు ఊతమిస్తున్న వంశధార జలాశయం నిర్వాసితుల కష్టాలు తీరడం లేదు. జగన్‌ ప్రభుత్వం చెల్లిస్తామన్న అదనపు పరిహారం మంజూరులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. 2022 జూన్‌లో జిల్లాకు ముఖ్యమంత్రి జగన్‌ వచ్చే రెండు రోజుల ముందు హడావుడిగా కొందరు నిర్వాసితుల ఖాతాలకు రూ.లక్ష చొప్పున అదనపు పరిహారం జమ చేశారు. 8 నెలలు పూర్తయినా చాలా మందికి పీడీఎఫ్‌, యూత్‌ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ, భూములకు పరిహారం జమ కాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. విద్యా ‘కానుక’ గుత్తేదార్లకే!

వచ్చే విద్యా సంవత్సరంలో ‘విద్యాకానుక’ కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే బూట్లు, బ్యాగ్‌ల ధరలు భారీగా పెరిగాయి. 2023-24 విద్యాకానుకలకు సమగ్ర శిక్ష అభియాన్‌ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. నోటు పుస్తకాలు మినహా మిగతా అన్నింటి సరఫరాకు ఇప్పటికే గుత్తేదార్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 43,10,165 మంది విద్యార్థులకు రూ. 1,042.53 కోట్లతో విద్యాకానుక కిట్లను అందించనున్నారు. బూట్లు, బ్యాగ్‌ల ధరలు 2022-23 నాటికంటే ఎక్కువగా ఉన్నాయి. నాణ్యమైన, పెద్దసైజు బ్యాగ్‌లు ఇవ్వడం, ఈసారి మరింత మెరిసే బూట్లు కొంటున్నందున ధరలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చెత్త పన్ను.. కొత్త మెలిక

చెత్త సేకరణ రుసుముల వసూళ్లపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పుర, నగరపాలక సంస్థల అధికారులు వెనక్కి తగ్గడం లేదు. రుసుములు చెల్లించని దుకాణాల ముందు చెత్త వేయించి భయపెట్టిన అధికారులు.. ఇప్పుడు వ్యాపార లైసెన్సుల పునరుద్ధరణకు ఈ రుసుములతో ముడి పెడుతున్నారు. బకాయిలతో రుసుములు చెల్లించిన వ్యాపారుల లైసెన్సులే పునరుద్ధరిస్తున్నారు. కొవిడ్‌ తరువాత వ్యాపారాలు దెబ్బతిని ఇబ్బంది పడుతున్న వ్యాపారులు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పేదలకు ఇళ్ల జాగాలు!

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థలం కలిగి ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకుగాను రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు జీవో 58 కింద వాటిని క్రమబద్ధీకరించి త్వరలో పట్టాలు అందజేసేందుకూ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నిరుపేదలకు ఎక్కడైనా జాగాల కొరత ఉంటే వారికి అందుబాటులో ఉన్న ఇంటి స్థలాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నాగార్జున దూరవిద్య పరీక్షల్లో అక్రమాలు

ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య పరీక్షల్లో వెలుగుచూస్తున్న అక్రమాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లో దూరవిద్య కేంద్రాలను నిర్వహిస్తున్న వర్సిటీ... ఈ సారి అక్కడివారికి పరీక్ష కేంద్రాలను ఏపీలో కేటాయించింది. ఈ పరీక్షల నిర్వహణలో అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఉపకులపతికి తెలియకుండానే ఉన్నత విద్యాశాఖ ప్రత్యేకంగా రెండు బృందాలతో తనిఖీలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారతీయ విద్యార్థులకు శుభవార్త

వర్క్‌ పర్మిట్ల (ఓపీటీ) విషయంలో కొన్ని రంగాల్లో పని చేయాలనుకుంటున్న విద్యార్థులకు ప్రీమియం ప్రొసెసింగ్‌ను వర్తింపజేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. సోమవారం అగ్రదేశం ప్రకటించిన ఈ విధానం ద్వారా సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితంలలో (స్టెమ్‌) ప్రీమియం ప్రొసెసింగ్‌ను వర్తింపజేస్తారు. దీనివల్ల భారతీయ విద్యార్థులకు అత్యధిక ప్రయోజనం కలగనుంది. ఈ విధానం ఈ నెల 6వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు అమెరికా వలస సేవల విభాగం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వృద్ధి రేటుపై రాజన్‌ వ్యాఖ్యలు సరికాదు.. ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక

 హిందు (4-7 దశాబ్దాల క్రితం నాటి) వృద్ధి రేటుకు భారత్‌ మళ్లీ చేరువవుతోందన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యలను ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక తోసిపుచ్చింది. ఇటీవలి జీడీపీ, పొదుపు, పెట్టుబడుల  గణాంకాలు ఆధారంగా రాజన్‌ చేసిన వ్యాఖ్యలు తప్పుగా, పక్షపాతంతో చేసినవని పేర్కొంది. రాజన్‌ ఆందోళన వ్యక్తం చేసినంత తీవ్రంగా జీడీపీ వృద్ధి గణాంకాలు లేవని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదికలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. IND Vs AUS: మనోళ్లు ఆ టెక్నిక్‌ వాడితే..: సునీల్ గావస్కర్ కీలక సూచనలు

అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టులో ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు భారత బ్యాటర్లు బ్యాట్‌ హ్యాండిల్‌ను కొద్దిగా చివర్లో పట్టుకుని ఇంకాస్త వంగి ఆడాలని సూచించాడు. ఇందౌర్‌లో జరిగిన మూడో టెస్టులో బంతి గిర్రున తిరగడంతో భారత బ్యాటర్లు ఆసీస్‌ స్పిన్నర్లకు తలవంచిన నేపథ్యంలో అతడిలా అన్నాడు. 1987లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై బెంగళూరులో తానాడిన ఇన్నింగ్స్‌ను ఈ సందర్భంగా ఉదహరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇక్కడకు మగవాళ్లు రాకూడదు!

మన దేశంలో కొన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించరు. అయితే దీనికి పూర్తి భిన్నంగా కొన్ని దేవాలయాలున్నాయి. ఇక్కడ కేవలం మహిళలకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంది... ఈ ఆలయం కన్యాకుమారిలో ఉంది. పెళ్లైన మగవాళ్లకి ఈ గుడి ప్రాంగణంలోకి కూడా ప్రవేశం లేదు. పరమశివుడిని భర్తగా పొందాలని పార్వతీ దేవి ఇక్కడ తపస్సు చేసిందని చెబుతారు. మహిళలు, ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు ఈ గుడిని ఎక్కువగా దర్శించుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్‌ వ్యాపారి అరుణ్‌ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని