Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Mar 2023 12:26 IST

1. ఏప్రిల్‌లో డిస్నీ 4000 ఉద్యోగాల కోత!

వినోద రంగ దిగ్గజం డిస్నీ వ్యయాల కోతకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాబోయే వారాల్లో లేఆఫ్‌ ఇచ్చేందుకు వీలున్న ఉద్యోగుల జాబితాలను తయారు చేయాల్సిందిగా మేనేజర్లను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో కనీసం 4000 మంది ఉద్యోగుల లేఆఫ్‌ ఉండొచ్చని న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేసే బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అనే వెబ్‌సైట్‌ పేర్కొంది. ఏప్రిల్‌ 3న డిస్నీ వార్షిక సమావేశం జరగనుంది. అంతకుముందే వ్యయ నియంత్రణ చర్యలను ప్రకటించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కొంపముంచిన వాన

విశాఖ పిచ్‌ ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలం. అయితే రెండ్రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పు పిచ్‌ పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసింది.  శుక్ర, శనివారాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు కూడా పడ్డాయి. ఇక శనివారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 10 గంటల వరకు చినుకులు పడుతూనే ఉన్నాయి. దీంతో వికెట్‌పై తేమ అలాగే ఉండిపోయింది. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకున్న ఆసీస్‌.. అయిదుగురు పేసర్లతో బరిలో దిగింది. వారిలో స్టాయినిస్‌కు బౌలింగ్‌ చేసే అవసరమే రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రికార్డులు మార్చేసి.. ఉచితాన్ని అమ్మేసి

గ్రేటర్‌లో కొన్నాళ్లుగా అమలు చేస్తున్న ఉచిత నీటి పథకాన్ని కొందరు క్షేత్రస్థాయి జలమండలి సిబ్బంది అమ్మకానికి పెట్టారు. రికార్డుల్లో వివరాలను తారుమారు చేసి అనర్హులకు మేలు చేస్తామని కొత్త దందాకు తెరతీశారు. ఒక్కో నల్లాను ఇలా మార్చడానికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. సైనిక్‌పురి డివిజన్‌లో ఓ సెక్షన్‌ ఏకంగా 400 నల్లాల రికార్డులను మార్చేసి...అర్హత కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. అల్వాల్‌ డివిజన్‌లోనూ భారీ ఎత్తున ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బాబోయ్‌.. భాగ్యనగర్‌ రైలు

భాగ్యనగర్‌ రైలు సమయానికి రాక ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ, ఉపాధి, తదితర పనుల నిమిత్తం వేల మంది ప్రయాణికులు కాగజ్‌నగర్‌ నుంచి ఈ రైలులో రాకపోకలు సాగిస్తుంటారు. కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు కొంత మేరకు ఫర్వాలేదు. కానీ సికింద్రాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌ ప్రయాణం నరకం కనిపిస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న స్టేషన్లలో గంటల తరబడి నిలుపుతుండటంతో వ్యాధిగ్రస్థులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమ్మలకు అగ్నిపరీక్ష

వాళ్టి రోజున బాగా చదివితేనే స్థిరమైన జీవితం అనుకుంటున్నారంతా. దీంతో చదువూ వ్యాపార ధోరణిలోకి మారింది. ఆ పోటీలో నెగ్గుకురావాలనే ఆశతో తల్లిదండ్రులు ‘నీ కోసం మేమింత కష్టపతున్నాం, నువ్వు దానికి తగ్గట్టు చదివి బాగా స్థిరపడాలి’ అంటారు. తండ్రుల కంటే తల్లులు సున్నితం కనుక బాగా చదవమని ఒత్తిడిచేస్తారు. ప్రోత్సహించడం మంచిదే. కానీ తమ పిల్లల సామర్థ్యం గురించి ఆలోచించడం లేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వదల బొమ్మాళీ... పన్నుపిండేస్తాం!

చెత్త పన్ను వసూళ్లపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం రూటు మార్చింది. ఎలాగైనా వసూలు చేయాలని భావించిన ప్రభుత్వం ఆస్తి పన్నులో చెత్త పన్నును కలిపి డిమాండ్‌ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో రెండు నగరపాలక సంస్థలు, అయిదు పురపాలికల్లో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చుక్కల భూములకు తొలగిన చిక్కులు

భూమి వారిదే. అందుకు సంబంధించిన పత్రాలూ ఉన్నాయి. అయినా హక్కులు సంపాదించుకునేందుకు తహసీల్దార్‌ కార్యాలయాల దగ్గర నుంచి కలెక్టరేట్‌ వరకు కాళ్లరిగేలా తిరిగారు. కారణం నిషేధిత భూముల జాబితాలో నమోదు కావడమే. పిల్లల ఉన్నత చదవుల నిమిత్తమో, అమ్మాయిల వివాహ ఖర్చుల కోసమో, వైద్యచికిత్సల వ్యయానికో ఎవరికైనా అమ్ముదామన్నా... ఇల్లు కట్టుకునేందుకు లేదా పంట రుణం తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లినా నిరాశ ఎదురయ్యేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మోదీ అసాధారణ నేత.. చైనాలో భారీగా ఆదరణ

రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలున్నా భారత ప్రధాని నరేంద్ర మోదీకి చైనా ప్రజల్లో భారీగా ఆదరణ ఉందని, ఆయనను చైనీయులు అసాధారణ పురుషుడిగా పరిగణిస్తున్నారని అమెరికా పత్రిక ‘డిప్లొమాట్‌’ వెల్లడించింది. ఈ మేరకు ఒక కథనాన్ని అది ప్రచురించింది. మోదీ నాయకత్వంలోని భారత్‌ అగ్ర దేశాల మధ్య సమతూకం పాటిస్తోందని చైనా వ్యవహారాలను విశ్లేషించే జర్నలిస్టు ము షుంషాన్‌ అందులో పేర్కొన్నారు. ‘చైనీయులు సామాజిక మాధ్యమాల్లో ‘మోదీ లాక్షియన్‌’ అని మోదీకి పేరు పెట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పట్టభద్రుల్లో అసంతృప్తి నిజమే: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని, దీనిపై తాము సమీక్షించుకుంటామని మాజీమంత్రి, ఒంగోలు వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నట్లు ఈ ఎన్నికల్లో అర్థమైందన్నారు. రాష్ట్ర ఓటర్లలో వీరివి  రెండు శాతం మాత్రమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కేవలం మూడు సీట్లు గెలిచిన తెదేపా.. అధికారంలోకి వచ్చినట్లు సంబరాలు చేసుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్‌ మాత్రమే.. 2024 పూర్తి సినిమా: నారా లోకేశ్‌

‘నాడు సీఎం జగన్‌ ప్రతిపక్షాలను ఉద్దేశించి తన వెంట్రుక కూడా పీకలేరన్నారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఏకంగా గుండు కొట్టారు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. 47వ రోజు యువగళం పాదయాత్ర శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం చిన్నపల్లెవాండ్లపల్లిలో ప్రారంభమైంది. రాత్నాలపల్లి వద్ద 600 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా చిన్నయల్లంపల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జోగన్నపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు