Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Mar 2023 09:09 IST

1. కప్పు.. ఎవరి కొప్పులో

మొట్టమొదటి డబ్ల్యూపీఎల్‌లో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది. రెండు జట్లకు స్టార్‌ క్రికెటర్లు నాయకత్వం వహిస్తుండడంతో మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. అయితే జోరును కొనసాగిస్తూ ట్రోఫీని చేజిక్కించుకోవాలనుకుంటున్న ముంబయికి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఫామ్‌ కాస్త ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!

మూడేళ్లుగా తన పురోగతికి భయమే కారణమంటోంది నటి సమంత. రోజూ బోలెడంత భయం మధ్య జీవిస్తుంటానని చెబుతున్న ఆమె.. దాన్ని అధిగమించడానికి మార్గాలు అన్వేషిస్తుంటానని తెలిపింది. ఈ ప్రయాణంలోనే వ్యక్తిగా, నటిగా తనని తాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోగలుగుతున్నాని చెబుతోంది. ప్రస్తుతం ఆమె ‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమ కావ్యమిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మన చేతుల్లోనే.. ఆధార్‌ అప్‌డేట్‌

ప్రస్తుతం దేశంలో ఏ పనికైనా, ఎక్కడికి వెళ్లాలన్నా ఆధార్‌ కార్డును తప్పనిసరి. ఎంతో కీలకంగా మారిన ఈ కార్డును పదేళ్లకోసారి నవీకరణ (అప్‌డేట్‌) చేసుకోవాలని విశిష్ట గుర్తింపు పొందిన ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్దేశించింది. ఉచిత సేవలకు జూన్‌ 14 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకునేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినా సేవలు మాత్రం సక్రమంగా అందడం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ మాంసం తింటే అంతే!

కేరళలో.. పాడైన మాంసంతో వండివార్చిన ఆహారం తిన్న పదకొండో తరగతి విద్యార్థి అన్యాయంగా బలైపోతే.. అదే వంటకాన్ని ఆరగించిన మరో 60 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత.. తీరిగ్గా కళ్లు తెరిచిన అధికారులు.. ఆహార భద్రతా ప్రమాణాలు పాతిపెడుతున్నారంటూ సుమారు 200 హోటళ్లను మూయించారు. ఈ కేసులో నిందితులు ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా- ‘ప్రజారోగ్యం పట్ల దేశంలో మనం వ్యహరించేంత ఉదాసీనంగా ఇంకెవరూ ఉండర’ని చెప్పి బెయిల్‌ నిరాకరిస్తూ ఆవేదన వెలిబుచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కన్నీటి గాథ.. వెంటాడే వ్యధ

పొదిలి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాలెం గ్రామమది.. కొన్నేళ్లుగా వేధిస్తున్న ఫ్లోరైడ్‌ భూతంతో అనేకమంది తల్లడిల్లుతున్నారు. అనారోగ్యం, నడిచేందుకు సైతం ఓపిక లేక, కాయకష్టం చేసుకునే సత్తువ లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. భూగర్భంలో ఉన్న ఫ్లోరైడ్‌తో కూడిన నీళ్లు తాగకుండా ప్రభుత్వం శుద్ధజలం పంపిణీ తలపెట్టినా నిర్వహణ కరవై, ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ‘న్యూస్‌టుడే’ ఈ పల్లెను పరిశీలించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జగన్‌కు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు అందవు

మరోసారి జగన్‌కు ఓటు వేసి అధికారం ఇవ్వకపోతే మహిళలకు ప్రభుత్వ పథకాలేవీ అందవని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ఇంటి ఇల్లాలిని ఈ ప్రభుత్వం శక్తిమంతురాలిగా చేసింది. గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఇవ్వలేకపోయాయి.  మరోసారి జగన్‌కు ఓటు వేయాలి. మీ ఆశీర్వాదం లేకపోతే అక్కచెల్లెమ్మలకు సహాయం చేయడం అనవసరమనే భావన సమాజంలోకి వెళ్తుంది.’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాము కాటేసినా.. పరీక్షకు హాజరైన విద్యార్థిని

పాము కాటేసినా.. వెరవకుండా ఆ బాలిక పరీక్ష రాసింది. ఒడిశాలోని కేంఝర్‌ జిల్లా దధిబబపూర్‌ గ్రామానికి చెందిన విద్యార్థి లిప్సా రాణి సాహు(17) ఆనందపూర్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. శనివారం ఫైనల్‌ పరీక్ష రాసేందుకు ఇంటి నుంచి వెళ్తుండగా పాము కాటేసింది. వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆసుపత్రికి వెళ్దామని తల్లిదండ్రులు చెప్పినా.. పరీక్షలు రాయకపోతే ఏడాది కాలం వృథా అవుతుందని చెప్పి పరీక్షా కేంద్రానికే బయలుదేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గాయం ‘స్మార్ట్‌’గా మానిపోతుంది

రోజువారీ పనుల్లో మనకు చర్మం గీరుకుపోవడం, కాలిన గాయాలు కావడం సర్వసాధారణం. చాలావరకూ వాటిని శరీరమే నయం చేసుకుంటుంది. మొండి గాయాలు అంత తేలికగా లొంగవు. మధుమేహం ఉన్నవారిలో ఇది మరీ సంక్లిష్టం. వీరికి గాయాలు త్వరగా మానకపోగా.. ఒక్కోసారి తీవ్ర ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంటాయి. ఇది ఆ వ్యక్తులకే కాకుండా ఆరోగ్యపరిరక్షణ వ్యవస్థకు పెను భారమవుతోంది. మొండిగాయాల వల్ల ఒక్క అమెరికాలోనే ఏటా 250 కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నట్లు అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హాజరు వేయగానే.. వెళ్లిపోయారు

ఏలూరు జిల్లా దెందులూరులో శనివారం నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు అధికారులు, నాయకులు అత్యుత్సాహంతో భారీగా జనసమీకరణ చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50- 100 బస్సుల్లో పొదుపు సంఘాల మహిళలను తీసుకొచ్చారు. సభకు రాకపోతే రుణాలు, పథకాల విషయంలో ఇబ్బందులు పడతారని వారిని అధికారులు హెచ్చరించారు. గ్రూపుల వివరాలు, సభ్యుల పేర్లున్న రిజిస్టర్లు తీసుకొచ్చి అందరూ వచ్చారా లేదా అని సభా ప్రాంగణం దగ్గర హాజరు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘నీట్‌’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు

జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష(నీట్‌) రాసే వారికి ‘ప్రవేశ ఏడాది డిసెంబరు 31’ నాటికి కనీసం 17 ఏళ్లు ఉండాలనే నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఆ వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఈ వ్యవహారాన్ని ఉమ్మడి హైకోర్టు 2013, 2017లోనే తేల్చిందని గుర్తు చేసింది. కనీస వయసు 17 ఏళ్లుగా నిర్ణయించడం సమానత్వపు హక్కును నిరాకరించినట్లు కాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు