Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Mar 2023 09:31 IST

1. 8 నుంచి సికింద్రాబాద్‌-మేడ్చల్‌ ఎంఎంటీఎస్‌ సేవలు

ఎంఎంటీఎస్‌ రెండోదశ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ముందుగా అనుకున్నట్లు అన్ని మార్గాల్లో కాకపోయినా.. సికింద్రాబాద్‌-మేడ్చల్‌ల మధ్య ఎంఎంటీఎస్‌ సర్వీసులు పరుగు పెట్టనున్నాయి. ఏప్రిల్‌ 8న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారు. అదేరోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఎంఎంటీఎస్‌ రెండోదశను ప్రారంభిస్తారని సమాచారం. నడిచేవి ఎంఎంటీఎస్‌లే అయినా.. సబర్బన్‌ సర్వీసులుగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మొదలవుతోంది.. స్టిక్కర్ల వంతు!

అధికార వైకాపా మళ్లీ ప్రజల ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమైంది. స్టిక్కర్లు పట్టుకుని వాటిని ఇళ్లకు, ప్రజల సెల్‌ఫోన్లకూ అతికించే పని మొదలుపెడుతోంది. ఈ పేరుతో మరో ప్రచారార్భాటానికి తెరతీస్తోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ఇటీవలి వరకు తిరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని వైకాపా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నెలకోసారి వడ్డీ వచ్చేలా...

మీ తల్లిదండ్రుల వయసు 60 ఏళ్లపైన ఉంటే.. పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను పరిశీలించవచ్చు. ఇందులో 8 శాతం రాబడి వస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. మూడు నెలలకు రూ.20వేల వరకూ వడ్డీ వస్తుంది. బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లూ పెరిగాయి. నాన్‌క్యుములేటివ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకొని, నెలనెలా వడ్డీని పొందే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైఎస్సార్‌ కల్యాణమస్తు దరఖాస్తు గడువు కుదింపు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, భవన నిర్మాణ కార్మికులు, దివ్యాంగ యువతుల వివాహాలకు ఇచ్చే వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు దరఖాస్తు గడువును ప్రభుత్వం కుదించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు వివాహమైన తర్వాత 60 రోజుల వరకు గడువిస్తుండగా తాజాగా దాన్ని 30 రోజులకు కుదించింది. ఈ నెల 6వ తేదీనే సాంఘిక సంక్షేమశాఖ ఈ ఉత్తర్వులను విడుదల చేసినా అంతర్గతంగా మాత్రమే సంబంధిత శాఖలకు పంపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వయనాడ్‌ ఖర్చులు సమర్పించని ‘రాహుల్‌’పై ఈసీ వేటు!

ఎన్నికల్లో పోటీచేసి, నిర్ణీత గడువులోగా ఆ ఖర్చుల వివరాలను సమర్పించనందుకు రాహుల్‌గాంధీ అనే వ్యక్తిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. అయితే ఆయన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ కాదు. ఆయనో స్వతంత్ర అభ్యర్థి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీచేసి 2,196 ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి 7 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి పూర్తి పేరు కె.ఇ.రాహుల్‌గాంధీ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కళ్లు మూసుకో అని చెప్పి.. కత్తితో పొడిచి చంపారు

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో తన భార్యను వేధిస్తున్నాడనే కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడిని హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాధారాలు లభించకుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కలుగా చేసి చెత్తకుప్పలో పడేశాడు. బాపునగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే మహ్మద్‌ మీరజ్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌ స్నేహితులు. ఇమ్రాన్‌ కోసం అతని ఇంటికి వెళ్లే మీరజ్‌.. మిత్రుడి భార్యను తరుచూ వేధించేవాడు. దీనిపై ఆగ్రహించిన ఇమ్రాన్‌ పలుమార్లు హెచ్చరించినా మీరజ్‌ తీరు మారకపోవడంతో అతణ్ని చంపాలని పథకం రచించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమ్మ సొమ్మంటే అంత అలుసా?

దుర్గగుడి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అమ్మవారి సొమ్ము రూ.కోట్లలో వృథా అవుతోంది. కట్టడం.. కూల్చడం ఇక్కడ అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మవారి చరిత్ర భక్తులకు వివరించేందుకు 2017లో రూ.3 కోట్లు వెచ్చించి అప్పటి ఈవో సూర్యకుమారి ఇంద్రకీలాద్రిపై లేజర్‌ షోను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన భక్తులను ఆకట్టుకోలేకపోయింది. ఆరేళ్లలో దీని గురించి పట్టించుకున్నవారే కరవయ్యారు. ఇటీవల ఈ ప్రదర్శన ఏర్పాటు చేసే ప్రాంతంలో ఉన్న తెరను తొలగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బటన్ నొక్కినా.. బ్యాంకులో పడలేదు..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌నొక్కి ఆరు రోజులు గడుస్తున్నా.. ఎన్నికల హామీ నెరవేర్చామని చెబుతూ లబ్ధిదారుల ఇళ్లకు అతికించేందుకు సీఎం బొమ్మతో స్టిక్కర్లు కార్యాలయాలకు చేరినా.. ఆసరా మూడో విడత రుణమాఫీ సొమ్ము మాత్రం జిల్లాలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు జమ కాలేదు. రుణమాఫీ లబ్ధిపొందిన ప్రతి మహిళ ఇంటికి స్టిక్కర్‌ వేయాలని ఆదేశాలు ఇచ్చారు. వీటిని ఆయా మండల సమాఖ్యలకు పంపించి, అక్కడి నుంచి గ్రామాలకు వీవోఏల ద్వారా సరఫరా చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సామాన్యులకు భారంగా రైలు ప్రయాణం

కొవిడ్‌ సమయంలో తాత్కాలికంగా నిలిపివేసిన ప్యాసింజర్‌ రైళ్లను తిరిగి ప్రారంభించలేదు. ప్రస్తుతం వాటి స్థానంలో ఎక్స్‌ప్రెస్‌లను నడపడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతికి పర్యాటకులతో పాటు సాధారణ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కొత్త ఇంటికి బాదుడు

కొత్త ఇంటి నిర్మాణ సమయంలో విద్యుత్తు అవసరం తప్పనిసరి. దీన్ని ఆసరా చేసుకుని కేటగిరి-2 కింద (వాణిజ్య అవసరాల) రూ.5,600 వసూలు చేస్తున్నారు. ప్రజలపై భారం మోపకూడదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు దీన్ని అమలు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఖజానా నింపుకొనేందుకు కచ్చితంగా అమలు చేస్తోంది. కొత్తగా ఎవరు ఇల్లు నిర్మించుకున్నా కేటగిరి-2 కిందనే కనెక్షన్‌ ఇస్తున్నారు. యూనిట్‌ విద్యుత్తుకు రూ.5.40కుపైగా వసూలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని