Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Jun 2023 09:32 IST

1. ట్రూఅప్‌... కట్టాలంటే అప్పు

విద్యుత్తు తీగ తగిలితేనే మనిషికి షాక్‌ కొట్టేది... కానీ విద్యుత్తు సంస్థల తీరుతో బిల్లు ముట్టుకున్నా అంతకు మించి షాక్‌ కొడుతోంది. ఎప్పుడు ఏ రూపంలో విద్యుత్తు బిల్లులను అదనంగా వినియోగదారుని ముక్కు పిండి వసూలు చేస్తారో వారికే తెలియదు. ఇబ్బడిముబ్బడిగా రకరకాల పేర్లు పెట్టుకుంటూ వినియోగదారుని జేబుకు చిల్లు పెడుతున్నాయ్‌ విద్యుత్తు సంస్థలు. ఇప్పుడు మరో బాదుడుకు సదరు సంస్థ రంగం సిద్ధం చేసింది. పేరు పాతదే అయినా విధానానికి కొత్త మార్గం అన్వేషించి వినియోగదారునిపై స్వారీ చేస్తున్నాయ్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అదనంగా 6 రకాలుగా బాదుడు

విశాఖ వంటి నగరంలో విలువలు పెంచిన ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉండనుంది. కొన్నింటి మీద వెంటనే ప్రభావం చూపగా ఆస్తి పన్ను మీద వచ్చే ఏడాది నాటికి ప్రభావం కనిపిస్తుంది. జూన్‌ ఒకటి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భూముల మార్కెట్‌ విలువ ఆధారంగా కొన్ని రుసుములతో పాటు పన్నులు పెరగడంతో కొత్తగా భవన నిర్మాణాలు చేపట్టే వారికి నగర పరిధిలో అదనపు ఖర్చు తప్పదు. ఇది స్థిరాస్తి రంగాన్ని కుదేలు చేస్తుందని నెరెడ్కో, క్రెడాయ్‌ వంటి సంస్థలు వినతులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘చేయి’పట్టి నడుస్తారా?..జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌ వైపే మొగ్గు!

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలిసింది. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత చేరికలుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఇటీవలే వీరిద్దరినీ కలిసి చర్చించినట్లు సమాచారం. మరోవైపు భాజపా కూడా ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రామగుండంకు వందే భారత్‌ రైలు!

సికింద్రాబాద్‌ జంక్షన్‌ నుంచి నాగ్‌పూర్‌ స్టేషన్‌ మధ్య వందే భారత్‌ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. ఈ మార్గంలో వందే భారత్‌ రైలు ప్రవేశపెట్టడం ద్వారా దాదాపు 4 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. సుమారు 580 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో ఇప్పటికే 30 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం గరిష్ఠంగా 10 గంటల సమయం పడుతుండగా వందే భారత్‌తో 6 గంటల్లోనే గమ్య స్థానానికి చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రాణం కాపాడేది.. ఆహార ప్రమాణాలే

ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు అధ్యయనాలతో వెల్లడించిన వాస్తవాలు ఇవి. కల్తీ, నాణ్యత లోపించిన, హానికర మిశ్రమాలతో అసురక్షితంగా మారుతున్న ఆహార పదార్థాల చలామణిని నియంత్రించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయి. ప్రజలకు సురక్షిత ఆహారం లభించేలా చేయడం కోసం అందరిలో చైతన్యం నింపడానికి ఏటా ప్రపంచ ఆరోగ్య, ఆహార, వ్యవసాయ సంస్థలు ఏటా జూన్‌ 7న సురక్షిత ఆహార దినోత్సవం నిర్వహిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పొగ మానేస్తే కోటీశ్వరులే

ఉమ్మడి జిల్లాలో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల వ్యాపారం : రూ.217 కోట్లు(నెలకు).. ఈ డబ్బంతా పొదుపు, పెట్టుబడిలో జమచేస్తే వేలాది కుటుంబాల్లో ఎంతో వెలుగు. విలువైన ఆరోగ్యం మన సొంతం... ఆలోచించండి.. గ్లోబల్‌ అడల్ట్‌ టొబాకో సర్వే (జీఏటీఎస్‌) ప్రకారం 2016-17లో రాష్ట్రంలో 25.9 శాతం మంది పురుషులు, 9.8 శాతం మంది మహిళలు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు తేలింది. ఆ తరువాత 2019-20లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ప్రకారం పురుషులు 22.3 శాతం, మహిళలు 5.6 శాతం పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు గుర్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సామాన్య ప్రయాణికులపై రైల్వే శాఖ నిర్లక్ష్యం

పేదలు, సామాన్యులు, వలస కూలీలు, దిగువ మధ్య తరగతి ప్రజలు రైళ్లలో ప్రయాణించే జనరల్‌, స్లీపర్‌ క్లాస్‌ బోగీలపై రైల్వేశాఖ నిర్లక్ష్యం చూపిస్తోంది. ప్రయాణికుల రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీలను పెంచాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. జనరల్‌ బోగీలను మొక్కుబడిగా ఒకటి, రెండుకి పరిమితం చేయడం, స్లీపర్‌ బోగీలను తగ్గించేయడం కొంతకాలంగా ఎక్కువైంది. దీంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు నరకం చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే అనేక రైళ్లలో ఇదే దుస్థితి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. డోలాయమానంలో డిగ్రీ చదువు

డిగ్రీ ప్రవేశాలలో ఉన్నత విద్యామండలి జాప్యం చేస్తోంది. ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలై 40 రోజులు దాటినా ప్రవేశాల ప్రకటన విడుదల కాలేదు. తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌ కొనసాగుతుండగా.. ఇక్కడ నోటిఫికేషన్‌ ఎప్పుడన్న దానిపైనే ఇంతవరకూ స్పష్టత లేదు. గతేడాది సైతం డిగ్రీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం చేశారు. గతేడాది నవంబరు చివరి వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈసారి తొందరగా ప్రవేశాలు చేపట్టాలని కళాశాలల యాజమాన్యాలు వినతులు ఇస్తున్నా పట్టించుకోవట్లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వైకాపా భజనలో వీసీలు

వైకాపా పాలనలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి తీసికట్టుగా తయారైంది. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకుల్లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉండాలంటూ పదేపదే వల్లించే సీఎం జగన్‌ హయాంలో ప్రతిష్ఠాత్మక వర్సిటీలు ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. విద్యా ప్రమాణాలు, నాణ్యత కొరవడి ర్యాంకుల్లో దిగజారుతున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకుల్లో మొదటి 10స్థానాల్లో రాష్ట్రం నుంచి ఒక్క విద్యా సంస్థ, వర్సిటీ కూడా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ట్రిపుల్‌ ఐటీ.. ‘ప్రాంగణ’ జీతాల్లో మేటి

ప్రాంగణ నియామకాల వార్షిక వేతన ప్యాకేజీలో హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ ప్రముఖ ఐఐటీలన్నిటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే, దిల్లీ, మద్రాస్‌లలో ఎంపికయ్యే విద్యార్థుల మధ్యగత (మీడియన్‌) వేతనం కంటే హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ అందనంత దూరంలో ఉండటం విశేషం. ఐఐటీల్లో చదివిన బీటెక్‌ విద్యార్థులకు 2021-22 విద్యా సంవత్సరంలో మధ్యగత వార్షిక వేతనం అత్యధికంగా రూ.22.07 లక్షలు ఉండగా.. గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో అది ఏకంగా రూ.30.36 లక్షలు కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని