Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Nov 2021 20:59 IST

1. మహారాష్ట్రలో ఎదురు కాల్పులు: 26 మంది మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర గడ్చిరోలిలోని అటవీ ప్రాంతం మావోయిస్టులు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పులతో మరోసారి దద్దరిల్లింది. జవాన్లు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 26 మంది మావోలు మృతిచెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Rizwan: ఐసీయూలో 35 గంటల పాటు.. మేమే ఆశ్చర్యపోయాం: భారతీయ వైద్యుడు

టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్‌ పరాజయం పాలైంది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆసీస్ పైచేయి సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో పాక్‌ ఆటతీరుతో క్రీడాభిమానుల మనసు గెలుచుకుంటే.. వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ను అయితే స్వదేశం సహా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అభినందనలతో ముంచెత్తింది. మ్యాచ్‌కు ముందు రెండు రోజులపాటు ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొంది మరీ కీలక పోరు కోసం సమాయత్తం కావడం ప్రశంసల వర్షం కురిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Khel Ratna: నీరజ్‌, మిథాలీరాజ్‌ సహా 12 మందికి ఖేల్‌రత్న పురస్కారాలు అందజేత

3. వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా?: కిషన్‌రెడ్డి

వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీ, ఆయుష్మాన్‌ భారత్‌, ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వకుండా ఒక్క హుజూరాబాద్‌కే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Delhi Air Crisis: దిల్లీలో పాఠశాలల మూసివేత.. వాయు కాలుష్యం ఎఫెక్ట్‌

దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కాలుష్యంపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సోమవారం నుంచి రాష్ట్రంలోని మొత్తం పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ అధికారులు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. AP News: తితిదేకు అరుదైన గుర్తింపు.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు గాను తితిదేకు ఇంగ్లాండ్‌కి చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌ సంస్థ సర్టిఫికెట్‌ అందజేసింది. శనివారం తిరుమలలో తితిదే పాలకమండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డికి  ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆ జీవోలు రద్దు చేస్తేనే విద్యార్థుల ఆందోళనకు ఫలితం: పవన్‌ కల్యాణ్‌

6. Taiwan: చైనా- తైవాన్‌ ఉద్రిక్తతలపై ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు

చైనా- తైవాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు చేసింది. తైవాన్‌ భద్రత విషయంలో అవసరమైతే తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని పేర్కొంది. తైవాన్‌ను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటే.. ఆస్ట్రేలియా వారితో చేరకపోవడం అనూహ్యమే అవుతుందని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పీటర్ డటన్ శనివారం ఓ వార్తాసంస్థతో అన్నారు. ‘తైవాన్‌ విషయంలో చాలా స్పష్టంగా, నిజాయతీగా ఉండాలని భావిస్తున్నాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. TS news: మహిళా ఎస్సై పట్ల అనుచిత ప్రవర్తన.. తెరాస నేతపై కేసు

సిరిసిల్ల జిల్లా యువజన తెరాస విభాగం అధ్యక్షుడు మనోజ్‌పై కేసు నమోదైంది. మహిళా ఎస్సైపట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేశామని సీఐ అనిల్‌ వెల్లడించారు. సిరిసిల్లలో భాజపా, తెరాస శ్రేణులు ఘర్షణ పడగా.. ఆపేందుకు వెళ్లిన మహిళా ఎస్సై పట్ల మనోజ్‌ అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. ప్రధానిపై రసమయి బాలకిషన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని భాజపా నిరసనకు దిగింది. గాంధీ చౌక్‌ వద్ద రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు భాజపా శ్రేణులు యత్నించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Covid Cases: కొవిడ్‌తో జర్మనీ విలవిల.. గరిష్ఠానికి ఇన్‌ఫెక్షన్‌ రేటు!

యూరప్‌లో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జర్మనీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ సంఖ్యలో బాధితులతో ఇక్కడి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. తాజాగా దేశంలో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వారం వ్యవధిలో ఈ రేటు లక్ష మందికిగానూ 277.4గా నమోదైంది. వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఇదే అత్యధికం. జర్మన్‌ ప్రభుత్వ సంస్థ రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్(ఆర్‌కేఐ) ఈ గణాంకాలు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

WHO: ఎవరికి టీకాలు ఇస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం..

9. AP News: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు స్వాగతం పలికిన సీఎం జగన్‌

3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌ షాకు ఏపీ సీఎం జగన్‌  శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కాసేపట్లో అమిత్‌ షాతో కలిసి సీఎం జగన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అమిత్‌ షా.. తిరుపతిలోని తాజ్‌ హోటల్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. padutha theeyaga: ‘పాడుతా తీయగా’ 19వ సీజన్ ప్రత్యేకతలివే..!

సంగీతంతో ఎస్పీ బాలు(SP Balu)ది ఎన్నెన్నో జన్మల బంధం. అది ఎన్నటికీ వీడని రాగబంధం. పరిమళ గంధం. గంధర్వులే ఆవహించారేమో అన్నట్టు ఆయన పాడతారు. పాడటమే కాదు వేలమంది యువగాయకుల స్వరమై నిలిచారు. 1996లో ఈటీవీలో ప్రారంభమైన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) బాలు మానస పుత్రిక. దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) అనేకమంది గాయకులను ప్రపంచానికి పరిచయం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని