Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 03 Jul 2022 20:55 IST

1. తెలంగాణలో మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ : ప్రధాని హామీ

ప్రాచీన సంస్కృతి, పరాక్రమాల పుణ్యస్థలం తెలంగాణ అని ప్రధాని మోదీ కొనియాడారు. తెరాసను ఉద్దేశించి ఎలాంటి విమర్శలు చేయని ప్రధాని..  భాజపా విజయసంకల్ప సభలో కేంద్రం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రసంగం కొనసాగించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఏ పనులు చేస్తామో వివరించారు. తెలంగాణలో మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారన్నారు.

Live Blog: ‘కల్లబొల్లి కబుర్లే’.. భాజపా సమావేశాలపై మంత్రి హరీశ్‌ రావు

2. తెలంగాణలో అధికారం మాదే: అమిత్‌ షా

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో భాజపాదే విజయమని కేంద్రమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను ఎలా సీఎం చేయాలనేదే కేసీఆర్‌ ఆలోచన అని విమర్శించారు. తెలంగాణ విమోచన దినాన్ని కేసీఆర్ వ్యతిరేకించారన్నారు. తెరాస కారు స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ చేతిలో ఉందన్న షా.. కేసీఆర్‌ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా? అని ప్రశ్నించారు. 

3. వైకాపాకు, జనసేనకు ఉన్న తేడా అదే..: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌కు వైకాపా హానికరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏ ఒక్కరి వల్లో రాష్ట్రం బాగుపడుతుందని తాను అనుకోవడంలేదని.. చిత్తశుద్ధితో కూడిన కార్యకర్తలు ప్రతి గ్రామంలో పట్టుమని పది మంది ఉండి.. రాష్ట్రానికి బలమైన నేతల సమూహం ఉంటే తప్ప సమస్యల వలయం నుంచి బయటకు తీసుకురాలేమన్నారు. ఆ బాధ్యతను జనసేన తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని వైకాపా రాక్షస పాలన నుంచి బయటపడేయొచ్చన్నారు

4. గణనీయంగా తగ్గిన బ్యాంకు మోసాలు

రూ.100 కోట్లు ఆపై విలువ చేసే బ్యాంకు మోసాలు 2021-22లో గణనీయంగా తగ్గాయి. క్రితం ఏడాది రూ.1.05 లక్షల కోట్లుగా ఉన్న మోసాల మొత్తం రూ.41,000 కోట్లకు దిగొచ్చాయి. అధికారిక గణాంకాల ప్రకారం అదే సమయంలో మోసాల సంఖ్య సైతం 265 నుంచి 118కి తగ్గాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మోసాల కేసులు 167 నుంచి 80కి, ప్రైవేటు బ్యాంకుల్లో 98 నుంచి 38కి తగ్గాయి.

5. అమరావతిలో కెమిస్ట్‌ హత్య..: హంతకుడు సుశిక్షితుడే..!

అమరావతికి చెందిన కెమిస్ట్‌ ఉమేశ్‌ కొల్హే హత్య పథకం ప్రకారమే జరిగినట్లు దర్యాప్తును చూస్తే తెలుస్తోంది. శిక్షణ పొందిన హంతకుడే అతని హత్యలో పాల్గొనట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. తాజాగా శవపరీక్షలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఉమేశ్‌ గొంతుపై ఐదు అంగుళాల వెడల్పు, ఏడు అంగుళాల పొడవు, ఐదు అంగుళాల లోతుతో గాయం ఉన్నట్లు గుర్తించారు. దాడి చేసిన వెంటనే బాధితుడు మరణించేట్లు హంతకుడు జాగ్రత్త తీసుకొన్నట్లు తేలింది.

6. ఒకేరోజు వందల మంది ఉద్యోగులు ‘సిక్‌లీవ్‌’..!

ఇండిగోలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సంస్థకు చెందిన మొత్తం సిబ్బందిలో దాదాపు సగానికిపైగా (55శాతం) ఒకేరోజు సిక్‌లీవ్‌లో వెళ్లడం చర్చనీయాంశమైంది. దీంతో శనివారం ఒక్కరోజే దాదాపు 900 సర్వీసులపై ఈ ప్రభావం పడినట్లు పౌరవిమానయాన శాఖ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నుంచి వివరణ కోరింది. 

7. పాక్‌లో లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి

పాకిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 30 మంది ప్రయాణికులతో ఇస్లామాబాద్‌ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

8. లుహాన్స్క్‌ ప్రావిన్సును చేజిక్కించుకున్న రష్యా!

ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తూ ఒక్కో నగరాన్ని హస్తగతం చేసుకుంటోంది రష్యా. ఇందులో భాగంగానే లుహాన్స్క్‌ ప్రావిన్సును సైతం చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. లుహాన్స్క్‌ ప్రావిన్స్‌లో ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న చివరి ప్రధాన నగరాన్ని తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధ్యక్షుడు పుతిన్‌కు వెల్లడించింది.

9. ఇంగ్లాండ్‌ 284 ఆలౌట్‌.. టీమ్‌ఇండియాకు భారీ ఆధిక్యం

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ పూర్తయింది. ఆ జట్టు 284 పరుగులకు ఆలౌటైంది. జానీ బెయిర్‌ స్టో (106; 140 బంతుల్లో 14x4, 2x6) శతకంతో మెరిసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడికి కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ (25), సామ్‌ బిల్లింగ్స్‌ (36) చక్కటి సహకారం అందించారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 4, బుమ్రా 3, షమి 2, శార్దూల్‌ 1 వికెట్‌ తీశారు. ఇక టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 132 పరుగులుగా నమోదైంది.

10. ప్రభుత్వం నేతలే ప్రతిపక్షంగా మారారు.. సీఎం పదవి దక్కడం యాదృచ్ఛికం: శిందే

మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభం కాగా, తొలిరోజు స్పీకర్‌ పదవికి ఎన్నిక పూర్తయింది. ఈ సందర్భంగా నయా సీఎం ఏక్‌నాథ్‌ శిందే అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడారు. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని అందరూ భావించారని, కానీ ఆ పదవి తనకు దక్కడం యాదృచ్ఛికం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని