Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 15 Sep 2021 13:05 IST

1. ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ పాలిటెక్నిక్‌ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 (పాలిసెట్‌) ఫలితాలు వెల్లడయ్యాయి. మంత్రి గౌతమ్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది.

2. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరణ

అక్రమాస్తుల కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు పిటిషన్ల బదిలీ కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు..  బెయిల్‌ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

3. ఏపీలో రివర్స్‌ టెండరింగ్‌ తరహాలో రివర్స్‌ అభివృద్ధి: జీవీఎల్‌

అప్పులు చేయకపోతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి నెలకొందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గాన్ని సర్కారు ఆలోచించడం లేదన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ అనేది విధానపర నిర్ణయం అని జీవీఎల్‌ స్పష్టం చేశారు.

4. మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. కేరళలోనే సగానికి పైగా..

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం.. 27,176 కొత్త కేసులు, 284 మరణాలు సంభవించాయి. క్రితం రోజుతో పోల్చితే రోజువారీ కేసుల్లో 7 శాతం పెరుగుదల కనిపించింది. వరుసగా నాలుగో రోజు కేసుల సంఖ్య 30 వేలకు దిగువనే నమోదైంది. 

5. స్పుత్నిక్‌ లైట్ పరీక్షలకు డీసీజీఐ ఓకే..!

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ లైట్ ఒక్క డోసు టీకా మూడో దశ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించేందుకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి మంజూరు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. డీసీజీఐ అనుమతులు రావడంతో అతి త్వరలో ఈ టీకా ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

6. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ రికార్డు..

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ రికార్డు సృష్టించింది. కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారు, వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్న వారి సంఖ్య ప్రపంచంలోనే దేశంలో అత్యధికమని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈమేరకు వెబ్‌సైట్‌లో ఈ శాఖ కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌పై ఈ-పుస్తకాన్ని మంగళవారం ఉంచింది. 

7. జిన్‌పింగ్‌ను ఒప్పించలేకపోయిన బైడెన్‌..?

సుదీర్ఘకాలం తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. చైనా అధ్యక్షడు షీ జిన్‌పింగ్‌ ఇటీవల ఫోన్లో మాట్లాడుకున్నారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్‌ కాల్‌లో ఇరు దేశాధినేతలు పలు అంశాలపై చర్చించారు. అయితే ఈ సందర్భంగా ముఖాముఖీగా భేటీ అవుదామని బైడెన్ కోరగా.. జిన్‌పింగ్‌ అందుకు తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజం కాదని బైడెన్‌ తాజాగా చెప్పుకొచ్చారు.

అఫ్గాన్‌ పరిణామాలపై అరబ్‌ మిత్రులతో భారత్‌ చర్చలు

8. తాంబూలాలిచ్చిన  అమెరికా.. తన్నుకొన్న తాలిబన్లు..!

మీ తిప్పలు మీరు పడండి అంటూ అఫ్గానిస్థాన్‌ను వీడింది అగ్రరాజ్యం అమెరికా..! నాటో దళాలు అలా వెళ్లాయో లేదో  అఫ్గానిస్థాన్‌ మరో ప్రచ్ఛన్న యుద్ధానికి వేదికైంది. కతార్‌, పాకిస్థాన్‌ వర్గాలుగా విడిపోయి అధికారం కోసం తన్నుకొన్నాయి. ఇటీవల అఫ్గాన్‌ అధ్యక్ష భవనంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ విషయాన్ని తాలిబన్‌ వర్గాలు ఆంగ్ల వార్త సంస్థ బీబీసీ వద్ద ధ్రువీకరించాయి.

9. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు... వ‌చ్చేస్తున్నాయ్‌!

ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఓలా స్కూట‌ర్ బుకింగ్ పూర్తి చేయ‌డానికి గైడ్ కూడా ఈ క్రింది ఉంది. స్కూట‌ర్‌ని రిజ‌ర్వ్ చేసుకున్న క‌స్ట‌మ‌ర్‌లు మిగిలిన మొత్తాన్ని చెల్లించి దానిని కొనుగోలుగా మార్చుకోవ‌చ్చు. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు బుధ‌వారం విక్ర‌యానికి రానున్నాయి. క‌స్ట‌మ‌ర్ల కోసం, కొనుగోళ్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను రూపొందించ‌డంలో సాంకేతిక ఇబ్బందుల కార‌ణంగా కంపెనీ త‌న అమ్మ‌కాల‌ను వారం పాటు వాయిదా వేసింది. 

10. ఈ క్రికెటర్లు ఇలా కనిపించి.. అలా వెళ్లిపోయారు!

ముంబయి ఇండియన్స్‌ అనగానే రోహిత్‌ శర్మ, పొలార్డ్.. బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ అనగానే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్ అనగానే ఎం.ఎస్‌.ధోనీ, సురేశ్ రైనా.. ఈ పేర్లే మనకు గుర్తుకొస్తాయి కదూ. అవును..ఈ ఆటగాళ్లు చాలాకాలంగా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తూ కీలక ఆటగాళ్లుగా అవతరించారు. అయితే, ఐపీఎల్‌లో కొంతమంది ఆటగాళ్లు.. ఇలా కనిపించి అలా మాయమైన వాళ్లూ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు తరఫున ఒకే మ్యాచ్‌ ఆడి.. ఆ తర్వాత కాంట్రాక్టు కోల్పోయిన ఆటగాళ్లను ఓసారి చూస్తే.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని