Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Sep 2023 17:00 IST

1. ఈ ఫిర్యాదే ఒక అభూత కల్పన: హైకోర్టులో హరీశ్‌ సాల్వే వాదనలు

తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు(AP High court)లో వాదనలు కొనసాగుతున్నాయి. ఉదయం మొదలైన వాదనలు భోజన విరామం అనంతరం తిరిగి కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే (Harish Salve) వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఈ కేసులో పలు కీలక అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసలు ఈ ఫిర్యాదే ఓ అభూత కల్పనని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. జియో ఎయిర్‌ఫైబర్‌ వచ్చేసింది.. ప్లాన్లు, ఫీచర్లివే..!

టెక్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్‌ జియో ఎయిర్‌ఫైబర్‌ (Reliance Jio AirFiber) ఈరోజు విడుదలైంది. దీన్ని వినాయక చవితి సందర్భంగా మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఆగస్టు 28న జరిగిన 46వ సాధారణ వార్షిక సమావేశంలో ప్రకటించింది. అప్పటి నుంచి టెక్‌ ప్రియుల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. ఫీచర్లు, ప్లాన్ల వంటి విషయాలపై చాలా ఆతృతగా వేచిచూశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.  ఏం తప్పు చేశారని తెదేపా నేతల గృహ నిర్బంధాలు?: అచ్చెన్న

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతల గృహ నిర్బంధాలను తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. సైకో రెడ్డి పాలనలో దేవుడిని చూసే భాగ్యం కూడా లేదా అని ప్రశ్నించారు. జగన్ రెడ్డీ.. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేవని గుర్తుంచుకో అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన చంద్రబాబుపై జగన్‌ అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తున్న తెదేపా  నేతలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. వారు ఏం తప్పు చేశారని గృహ నిర్బంధాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు నిలదీశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఛారిటీలు, విద్యాసంస్థలకు ఐటీఆర్‌ దాఖలు గడువు పొడిగింపు

ఛారిటబుల్‌ ట్రస్టులు, మతపరమైన సంస్థలు, ప్రొఫెషనల్‌ బాడీలకు ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును పొడిగిస్తున్నట్లు ఆదాయ పన్ను విభాగం మంగళవారం ప్రకటించింది. అక్టోబర్‌ 31 నాటికి రిటర్నులు సమర్పించాల్సి ఉండగా.. దాన్ని ఓ నెల పాటు పొడిగిస్తూ నవంబర్‌ 30ని కొత్త గడువుగా నిర్ణయించింది. అలాగే 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫండ్లు, ట్రస్టులు, యూనివర్శిటీలు, ఇతర విద్యాసంస్థలు, వైద్య సంస్థలు సహా ఇతరత్రా సంస్థలు ఫారం 10బి/10బిబిలో ఇచ్చే తమ ఆడిట్‌ రిపోర్టులను సమర్పించే తేదీని సైతం అక్టోబర్‌ 31కి పొడిగిస్తున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. లష్కరే కమాండర్‌ను మట్టుపెట్టిన సైన్యం.. 7 రోజుల సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌కు ముగింపు

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు మధ్య ఏడురోజులుగా జరుగుతోన్న ఎన్‌కౌంటర్ కొలిక్కి వచ్చింది. లష్కరే తొయిబా కమాండర్ ఉజైర్‌ ఖాన్‌(Lashkar commander Uzair Khan)ను హతమార్చడంతో ఈ ఎన్‌కౌంటర్‌ ముగిసింది. అతడిని మట్టుపెట్టిన విషయాన్ని ఏడీజీపీ పోలీస్ విజయ్‌ కుమార్ ధ్రువీకరించారు. (Anantnag encounter) కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది రెండు మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 15 నుంచి దసరా ఉత్సవాలు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను అధికారులు, పాలక మండలి సభ్యులు సమీక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇతర దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తామని దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. అంతేకాకుండా ఉత్సవాలు జరిగే 10 రోజల్లో విధులు నిర్వర్తించేందుకు ఒప్పంద ప్రాతిపదికన మరికొంత మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు.  అన్నదాన భవనాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7.  డీలిమిటేషన్‌ తర్వాతే మహిళా రిజర్వేషన్లు..!

లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును (women reservation bill) కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న బిల్లుకు.. విపక్షపార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తుండటంతో చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉభయసభల ఆమోదం పొందినప్పటికీ.. 2027 తర్వాతే ఇవి అమల్లోకి వస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.  మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎంపీలకు అగ్నిపరీక్షే.. మోదీ కీలక వ్యాఖ్యలు..

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు (Women's Reservation Bill)కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ఈ బిల్లు ఎంపీలకు అగ్నిపరీక్షే’ అని మోదీ అభివర్ణించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు పూర్తయిన తర్వాత 2027 నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అబ్బే.. ఉక్రెయిన్‌కు మేము ఆయుధాలు అమ్మట్లేదు..: పాకిస్థాన్‌

 పాకిస్థాన్‌ (Pakistan) ఐఎంఎఫ్‌ ప్యాకేజీ పొందేందుకు ఏకంగా ఉక్రెయిన్‌ (Ukraine)కు ఆయుధాలను సరఫరా చేస్తోందనే నివేదికలు వెలువడుతున్నాయి. అయితే.. ఈ నివేదికలను పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయం తోసిపుచ్చింది. ఈ మేరకు కార్యాలయ ప్రతినిధి ముంతాజ్‌ జారా బలోచ్‌ మాట్లాడుతూ.. అటువంటి ఆరోపణలు పూర్తిగా ఆధార రహితమని, అభూత కల్పనలని ఖండించారు. ‘ఇంటర్‌సెప్ట్‌’ అనే ఇన్వెస్టిగేటివ్‌ వెబ్‌సైట్‌ ఆదివారం ఓ నివేదికను ప్రచురించింది. దీనిలో అమెరికా సాయంతో ఐఎంఎఫ్‌ బెయిలౌట్‌ ప్యాకేజీ పొందేందుకు పాకిస్థాన్‌ రహస్యంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు విక్రయిస్తోందని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10.  కెనడా-భారత్‌ ఉద్రిక్తతలు.. విద్య, వాణిజ్యంపై ప్రభావమెంత..?

భారత్‌ విషయంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన ప్రకటన.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది! భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం.. ఇటు భారత్‌ సైతం దీటుగా స్పందిస్తూ ఆ దేశ (Canada) రాయబారిపై వేటు వేయడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ తాజా పరిణామాలు ఇరు దేశాల పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలతో పాటు విద్యపై ఎలాంటి ప్రభావం చూపవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు అనేవి వాణిజ్య అంశాలపై ఆధారపడి ఉంటాయని.. అందుకే వాటిపై (Diplomatic relations) ప్రభావం చూపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు