Bhaskar Halami: ఆకలితో అలమటించిన రోజుల నుంచి అమెరికాలో సైంటిస్ట్ దాకా..
కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి భాస్కర్ హలమి జీవితం సరైన ఉదాహరణ. గడ్చిరోలిలోని ఓ మారుమూల పల్లెలో ఒక్కపూట తినడానికి కూడా కష్టపడ్డ కుంటుంబం నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు అమెరికాలో ఓ ప్రఖ్యాత సంస్థలో సీనియర్ సైంటిస్ట్ స్థాయికి చేరారు.
నాగ్పూర్: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనడానికి మహారాష్ట్రకు చెందిన భాస్కర్ హలమి జీవితం సరిగ్గా సరిపోతుంది. తినడానికి తిండి కూడా లేక ఆకలితో అలమటించిన రోజుల నుంచి అమెరికాలోని ఓ ప్రఖ్యాత సంస్థలో సీనియర్ శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ప్రతిఒక్కరిలో స్ఫూర్తి నింపుతుంది. కష్టపడేతత్వం, సాధించాలనే పట్టుదల ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని ఆయన నిరూపించారు.
గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తెహసీల్లోని చిర్చాడీ గ్రామానికి చెందిన భాస్కర్ ఇప్పుడు అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రధానంగా జన్యుపరమైన ఔషధాలపై పరిశోధనలు చేస్తుంటుంది. ఇందులో భాస్కర్ ఆర్ఎన్ఏ ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్నారు. చిర్చాడీ గ్రామంలో సైన్స్లో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి భాస్కరే. తర్వాత ఆయన మాస్టర్స్, పీహెచ్డీ కూడా పూర్తిచేసి అంచలంచెలుగా ఉన్నత శిఖరాలకు చేరారు.
ఒక్కపూట తినడానికి కూడా తిండి లేని ఆరోజులు అసలు ఎలా గడిచాయో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యమేస్తుందని భాస్కర్ అన్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొని బతికామంటేనే నమ్మబుద్ధి కావడంలేదని తెలిపారు. వర్షాకాలంలో తమకున్న చిన్న పొలంలో పంటలేసుకునేందుకు కూడా వీలుండేది కాదన్నారు. కొన్ని నెలల పాటు పని దొరక్క ఇప్ప పూలను వండుకొని తినేవాళ్లమని నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. బియ్యం పిండితో అంబలి కాచుకొని ఆకలి తీర్చుకునేవాళ్లమన్నారు. తమ ఊళ్లో 90 శాతం మందిది ఇదే పరిస్థితి అని తెలిపారు.
ఏడో తరగతి వరకు చదువుకున్న తన తండ్రికి ఓ చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని భాస్కర్ తెలిపారు. 100 కి.మీ దూరంలోని ఓ స్కూల్లో తన తండ్రికి వంట చేసే పని దొరికిందని పేర్కొన్నారు. అక్కడి వరకు వెళ్లడానికి సరైన ప్రయాణ వసతులు కూడా ఉండేవి కాదని తెలిపారు. ఒకసారి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత అసలు అక్కడికి చేరుకున్నారా లేదా కూడా తెలిసేది కాదన్నారు. మళ్లీ రెండు, మూడు నెలలకు తిరిగొచ్చేవారన్నారు. కొన్నాళ్లకు ఆ స్కూల్ ఉన్న కసనూర్కు కుటుంబం మొత్తం మకాం మార్చిందని పేర్కొన్నారు.
భాస్కర్ ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు కసనూర్లోనే చదువుకున్నారు. తర్వాత స్కాలర్షిప్పై యవత్మల్లో ఉన్న ప్రభుత్వ విద్యానికేతన్లో పదో తరగతి వరకు విద్యను కొనసాగించారు. అనంతరం గడ్చిరోలినోని ఓ కాలేజీలో బీఎస్సీలో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత నాగర్పూర్లో కెమిస్ట్రీలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. 2003లో ప్రఖ్యాత లక్ష్మీనారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాస్ అయినప్పటికీ.. భాస్కర్కు పరిశోధనపై ఆసక్తి తగ్గలేదు. పీహెచ్డీ నిమిత్తం అమెరికా వెళ్లి డీఎన్ఏ, ఆర్ఎన్ఏలో పరిశోధనలు చేశారు. ‘మిషిగన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ’ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిర్నావోమిక్స్లో పనిచేస్తున్న తనకు.. తమ సంస్థల్లో చేరాలని కోరుతూ ప్రతివారం ఓ అరడజను కంపెనీల నుంచి ఇ-మెయిల్స్ వస్తుంటాయని ఆయనే స్వయంగా తెలిపారు.
తన విజయం వెనుక తన తల్లిదండ్రుల పాత్ర కీలకమైందని భాస్కర్ అన్నారు. వారు లేకుంటే తాను ఇక్కడి వరకు వచ్చి ఉండేవాణ్ని కాదన్నారు. తన తల్లిదండ్రుల కోసం చిర్చాడీలో ఓ ఇల్లు నిర్మించారు. కొన్నేళ్ల క్రితమే ఆయన తండ్రి చనిపోయారు. ఇటీవల మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి విభాగం అదనపు కమిషనర్ రవీంద్ర ఠాక్రే గడ్చిరోలిలో భాస్కర్ను సత్కరించారు. ‘ట్రైబల్ సెలబ్రిటీతో చాయ్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయనతోనే ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం