Ganesh immersion: గణేశ్‌ నిమజ్జనంపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు వెలువరించిన

Published : 14 Sep 2021 16:11 IST

హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.  నిమజ్జనం విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈమేరకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రేపు ఉదయం సీజేఐ ధర్మాసనం ఎదుట ప్రభుత్వం .. నిమజ్జనం అంశాన్ని ప్రస్తావించనుంది.

హైకోర్టు ఏం చెప్పిందంటే? 

సాగర్‌లో నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌, దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడానికి ధర్మాసనం అనుమతిచ్చింది. అయితే, ట్యాంక్‌ బండ్‌ వైపు విగ్రహాల నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసిన హైకోర్టు.. పీవీ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, సంజీవయ్య పార్క్‌ వైపు నుంచి చేసుకోవచ్చని తెలిపింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్‌ డ్యామ్‌ ఏర్పాటు చేసి .. అందులో నిమజ్జనం చేయాలని పేర్కొంది. వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని