TS News: కొత్తకోర్సులకు గుర్తింపునివ్వాలి: జేఎన్‌టీయూహెచ్‌కు హైకోర్టు ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో సంబంధం లేకుండా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొత్తకోర్సులకు గుర్తింపునివ్వాలని జేఎన్‌టీయూహెచ్‌ని హైకోర్టు ఆదేశించింది.

Updated : 09 Oct 2021 19:24 IST


హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో సంబంధం లేకుండా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కొత్తకోర్సులకు గుర్తింపునివ్వాలని జేఎన్‌టీయూహెచ్‌ని హైకోర్టు ఆదేశించింది. సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని ..వాటి స్థానంలో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి అవసరమన్న జేఎన్‌టీయూహెచ్‌ నిబంధనలను ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న ఐటీ కోర్సులను ప్రవేశ పెట్టేందుకు ఏఐసీటీఈ పలు కాలేజీలకు అనుమతినిచ్చింది. అయితే, కాలేజీలో మొత్తం సీట్ల సంఖ్య పెంచకూడదని స్పష్టం చేసింది. దీంతో పలు కాలేజీలు సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ ..వంటి కోర్సుల్లో సీట్లను వెనక్కి ఇచ్చి సీఎస్ఈ, ఆర్టిఫియల్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కోర్సులకు అనుమతివ్వాలని జేఎన్ టీయూహెచ్ ను కోరాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటేనే గుర్తింపునిస్తామని నిబంధన పెట్టిన జేఎన్ టీయూహెచ్.. పలు కాలేజీల వినతిని తోసిపుచ్చింది. 

ఏఐసీటీఈ ఆమోదించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలన్న జేఎన్ టీయూహెచ్ నిబంధనను సవాల్ చేస్తూ 11 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఇంజినీరింగ్ కోర్సుల అనుమతి, సీట్ల పెంపులో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉండదని.. ఏఐసీటీఈ, యూనివర్సిటీ మాత్రమే నిర్ణయించాలని కళాశాలల తరఫు న్యాయవాది వాదించారు. సంప్రదాయ కోర్సుల్లో సీట్లను జేఎన్ టీయూహెచ్ తగ్గించినప్పటికీ.. కొత్త కోర్సులకు అనుమతివ్వలేదని పేర్కొంది. రాష్ట్రంలో విద్యావసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జేఎన్ టీయూహెచ్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు... ప్రభుత్వ అనుమతి ఉండాలన్న జేఎన్ టీయూహెచ్ నిబంధనను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయంతో తుది విడత కౌన్సెలింగ్ నాటికి కొత్త కోర్సుల్లో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈనెలాఖరును తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని