TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ వాయిదాకు హైకోర్టు నిరాకరణ

గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న న్యాయస్థానం.. పరీక్ష వాయిదాకు నిరాకరించింది.

Updated : 05 Jun 2023 20:03 IST

హైదరాబాద్‌: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 11న యథాతథంగా జరగనుంది. 

ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గతేడాది అక్టోబరులో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. అయితే, టీఎస్‌పీఎస్సీ పాలక మండలి, సిబ్బందిలో మార్పులు చేయకుండా మళ్లీ వారితోనే పరీక్ష నిర్వహించడం తగదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకూ గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని.. యూపీఎస్సీ వంటి సంస్థకు పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ విచారణ జరిపారు. అన్ని జాగ్రత్తలతో పారదర్శకంగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు చేసినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది పరీక్ష రాయనున్నారని.. ఇప్పటికే లక్షన్నర మంది హాల్‌ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 995 పరీక్ష కేంద్రాలను కూడా సిద్ధం చేశారన్నారు. మరోవైపు పేపర్‌ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోందని.. త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు ఏజీ వివరించారు. కొంత మంది అభ్యంతరాల కోసం లక్షలాది విద్యార్థుల్లో గందరగోళం చేయవద్దన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. పరీక్ష వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని