Telangana News: కొత్త వేరియంట్‌పై ఆందోళన వద్దు.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: హరీశ్‌రావు

ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నామని, వైద్య, ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో అందరూ బూస్టర్‌ డోసు వేసుకోవాలని సూచించారు. 

Updated : 22 Dec 2022 21:17 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా పరిస్థితులపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జూమ్‌ ద్వారా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ కేసులు పెరిగితే చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆయన మాట్లాడారు. వచ్చేది పండుగల సీజన్‌ కావటంతో  క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, సంక్రాంతి పండుగల వేళ కొవిడ్‌ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై చర్చించారు.

‘‘కరోనా పట్ల ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం. ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీరును గమనిస్తున్నాం. వైద్య, ఆరోగ్యశాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో అందరూ బూస్టర్‌ డోసు వేసుకోవాలి. కొత్త వేరియంట్‌పై ప్రజలు భయాందోళనకు గురికావొద్దు. ఇప్పటికే కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నాం. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచాం. కరోనా వ్యాప్తి ఇప్పుడు లేనప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఔషధాలు, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు సిద్ధంగా ఉంచాలి. పాజిటివ్‌ నమూనాలు  జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలి. శంషాబాద్‌ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలి’’ అని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

తెలంగాణలో కొత్త కేసులు రోజుకు పదిలోపే..

రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి పదిలోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందులో ఒకటి రెండు మినహా మిగతా కేసులన్నీ హైదరాబాద్‌లోనే వస్తున్నాయి. అంటే దాదాపు అన్ని జిల్లాల్లో గత కొంతకాలంగా సున్నా కేసులు నమోదవుతున్నప్పటికీ కొత్త వేరియంట్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటం, ఇప్పటికే దేశంలోనూ బీఎఫ్‌ 7 కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. 
కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని