TS News: రేపటి నుంచితెలంగాణ వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే: హరీశ్‌రావు

తెలంగాణ వ్యాప్తంగా త్వరలో ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Updated : 20 Jan 2022 15:31 IST

హైదరాబాద్‌: రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు దిశానిర్దేశం చేశారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. 

ఫీవర్‌ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్‌ కిట్లను పంపిణీ చేస్తామని హరీశ్‌రావు చెప్పారు. పకడ్బందీగా సర్వే చేపట్టి కొవిడ్‌ను కట్టడి చేద్దామని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ఫీవర్‌ సర్వేలో వ్యాధిలక్షణాలను గుర్తిస్తే అక్కడికక్కడే హోం ఐసోలేషన్‌ కిట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ సమయంలో ఫీవర్‌ సర్వే విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఆ సమయంలో తమ పనితీరును నీతి ఆయోగ్‌ ప్రశంసించిదని హరీశ్ గుర్తు చేశారు. 

‘‘థర్డ్‌వేవ్‌లో కరోనా సోకినా కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. మరికొంతమంది పరీక్షలకు ముందుకు రావడం లేదు. అందుకే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి  సర్వే చేపడుతుంది. ముందు జాగ్రత్తగా రేపటి నుంచి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నాం. వ్యాధి లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్‌ కిట్‌ ఇచ్చి మందులు వాడుకునే విధానాన్ని తెలియజేస్తాం. సీఎం కేసీఆర్‌ నెలరోజుల క్రితమే టెస్టింగ్‌, హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆయన సూచనల మేరకు 2కోట్ల టెస్టింగ్‌ కిట్లు, కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేశాం. ఆయా కిట్లను అన్ని జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు సహా గ్రామ స్థాయి వరకు పంపించాం. జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం. రాష్ట్రంలోని 27వేల పడకలనూ ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చాం. 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు నిర్మించుకున్నాం. దీంతో ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచుకోగలిగాం. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ సూచనలను ప్రజలు పాటించాలి. లక్షణాలుంటే వెంటనే దగ్గర్లోని బస్తీ దవాఖానా, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే హోంఐసోలేషన్‌ కిట్‌ అందిస్తారు’’ అని హరీశ్‌రావు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు