TSPSC: పేపర్‌ లీకేజీ కేసు స్టేటస్‌ రిపోర్టు ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

పేపర్‌ లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్టేటస్‌ రిపోర్టు సమర్పణకు ప్రభుత్వానికి 3 వారాల గడువును విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Published : 21 Mar 2023 15:26 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేత బల్మూరి వెంకట్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో (TS High Courrt) విచారణ జరిగింది. దర్యాప్తు సక్రమంగా జరగట్లేదనే వాదనకు పిటిషనర్‌ సరైన ఆధారాలు సమర్పించలేదని కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ‘‘రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్‌ ఇది. లీకేజీ కేసులో సిట్‌ సమగ్రంగా దర్యాప్తు జరుపుతోంది. కేవలం ఇద్దరినే అరెస్టు చేశారని పిటిషనర్లు అంటున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశారు’’ అని కోర్టుకు వివరించారు.

వాదనలు విన్న ధర్మాసనం.. లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్టేటస్‌ రిపోర్టు సమర్పణకు ప్రభుత్వానికి 3 వారాల గడువును విధించిన న్యాయస్థానం.. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని