Hyderabad: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. రూ.80కే నగరమంతా తిరిగేయొచ్చు!

హైదరాబాద్‌లో సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టి-24 టికెట్‌ ధరను టీఎస్‌ఆర్టీసీ తగ్గించింది. తాజా నిర్ణయంతో వారికి టి-24 టికెట్‌ రూ.80కే లభించనుంది.

Updated : 08 May 2023 20:17 IST

హైదరాబాద్‌: నగర మహిళలకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టి-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.100 ఉన్న టి-24 టికెట్‌ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90కి, సీనియర్‌ సిటిజన్లకు రూ.80కి ఇటీవల టీఎస్‌ఆర్టీసీ తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకూ మరో రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త టి-24 టికెట్‌ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి రానుందని సజ్జనార్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రయాణించే వారికోసం టి-24 టికెట్‌ను ఆర్టీసీ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్‌ కొనుగోలు చేస్తే గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. టి-24 టికెట్‌కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున 25వేల వరకు టికెట్లు అమ్ముడవుతున్నాయని ఇటీవల సజ్జనార్‌ వెల్లడించారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్‌ అందుబాటులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని