TTD: శ్రీవారి దర్శనం.. ఈ తేదీల్లో సిఫార్సు లేఖలు అనుమతించరు!

సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. జ‌న‌వ‌రి 1న‌, అలాగే, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ

Updated : 27 Dec 2021 22:23 IST

స్వయంగా వచ్చే ప్రముఖులకే బ్రేక్‌ దర్శనం
తితిదే కీలక నిర్ణయం

తిరుమల: సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. జ‌న‌వ‌రి 1న‌, అలాగే, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ వ‌ర‌కు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించనున్నట్టు తెలిపింది. వారి సిఫార్సు లేఖల్ని స్వీకరించబోమని తితిదే అధికారులు స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

శ్రీవారి దర్శనానికి వచ్చే భ‌క్తులు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లేదా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకొని రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. శ్రీ‌వారి ఆలయంలో జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాదశి, జ‌న‌వ‌రి 14న‌ వైకుంఠ ద్వాద‌శి పర్వదినాల సంద‌ర్భంగా విచ్చేసే భ‌క్తులకు కొవిడ్‌నిబంధనలు పాటిస్తూ సంతృప్తిక‌ర‌మైన దర్శనం క‌ల్పించేందుకు తితిదే ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. ఈ పర్వదినాల నేపథ్యంలో జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.

గదుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు

- జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు వ‌స‌తి గ‌దుల ఆడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేశారు.
- శ్రీ‌వారి దర్శనానికి విచ్చేసే సామాన్య భ‌క్తుల‌ వ‌స‌తికి పెద్దపీట వేస్తూ తిరుమ‌ల‌లోని అన్ని గ‌దుల‌ను క‌రెంటు బుకింగ్ ద్వారా కేటాయించాల‌ని నిర్ణయించారు. 
- జ‌న‌వ‌రి 11 నుంచి 14వ తేదీ వరకు దాతల‌కు గదుల‌ కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు.

కల్యాణకట్ట: తల‌నీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకుల‌ను అందుబాటులో ఉంచారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ క్షురకులు పీపీఈ కిట్లు వినియోగిస్తారు.
అన్నప్రసాదం: అన్నప్రసాద భవనంలో కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఈ 10 రోజుల‌ పాటు ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల‌ వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.
వైద్యం: భక్తుల‌కు వైద్యసేవ‌లందించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి.
పార్కింగ్‌: తిరుమల‌లో పోలీసుల‌తో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వాహనాలు పార్కింగ్‌ ప్రాంతాల‌కు చేరేలా ఏర్పాట్లు చేశారు. 
కొవిడ్ నిబంధనలు: కొవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఒమిక్రాన్‌ దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలుజారీచేశాయి. అదే విధంగా, కొన్ని పట్టణాల్లో రాత్రి క‌ర్ఫ్యూ కూడా విధించారు. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు పర్వదినాల్లోనే కాకుండా మిగతా అన్ని రోజుల్లోనూ వ్యాక్సినేష‌న్ సర్టిఫికెట్ గానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్‌ గానీ తప్పనిసరిగా తీసుకురావాలి. తితిదే సిబ్బంది, వేలాది మంది భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు తితిదే విజిలెన్స్‌, సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు