కొవాగ్జిన్‌ టీకా వేయించుకున్న యూపీ సీఎం

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సోమవారం కరోనా వైరస్‌ టీకా తొలి డోసు వేయించుకున్నారు. లఖ్‌నవూలోని శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ సివిల్‌ ఆస్పత్రికి వెళ్లి ఆయన టీకా తీసుకున్నారు.

Published : 05 Apr 2021 11:00 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సోమవారం కరోనా వైరస్‌ టీకా తొలి డోసు వేయించుకున్నారు. లఖ్‌నవూలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ సివిల్‌ ఆస్పత్రికి వెళ్లి ఆయన టీకా తీసుకున్నారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాను ఆస్పత్రి సిబ్బంది ఆయనకు వేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘నేను ఈ రోజు దేశీయంగా రూపొందించిన కరోనా వైరస్‌ టీకా తీసుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి. తద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని కరోనా రహితంగా తీర్చిదిద్దే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. అదేవిధంగా అందరూ కొవిడ్‌ జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలి’ అని యోగి ట్వీట్‌లో వెల్లడించారు.

కాగా, యూపీలో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,136 మందికి కరోనా సోకగా, 31 మంది వైరస్‌ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో యూపీలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 8,881కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,738 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు యూపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో నిన్న రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 1.03లక్ష మందికి వైరస్‌ సోకగా.. 478 మంది కరోనాతో మృతి చెందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని