అమెరికా మాజీ అధ్యక్షుడి ‘శాండ్‌విచ్‌’కు అరవై ఏళ్లు

ప్రముఖులు ఇచ్చిన ఆటోగ్రాఫ్‌లు, వారితో దిగిన ఫొటోగ్రాఫ్‌లను భద్రంగా దాచుకోవడం చూశాం. కానీ, అమెరికాలోని ఇల్లినియస్‌కు చెందిన స్టీవ్‌ జెన్నె అనే వ్యక్తి ఆ దేశ మాజీ అధ్యక్షుడు సగం తిని వదిలేసిన శాండ్‌విచ్‌ను అరవై ఏళ్లుగా భద్రపరుస్తూ వస్తున్నాడు. ఇటీవల

Published : 07 Oct 2020 02:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖులు ఇచ్చిన ఆటోగ్రాఫ్‌లు, వారితో దిగిన ఫొటోగ్రాఫ్‌లను భద్రంగా దాచుకోవడం చూశాం. కానీ, అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన స్టీవ్‌ జెన్నె అనే వ్యక్తి ఆ దేశ మాజీ అధ్యక్షుడు సగం తిని వదిలేసిన శాండ్‌విచ్‌ను అరవై ఏళ్లుగా భద్రపరుస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆ శాండ్‌విచ్‌ ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడి మీడియా అతడిని ఇంటర్వ్యూలు చేస్తుండటంతో ఆ శాండ్‌విచ్‌ మరోసారి వైరల్‌గా మారింది.


(ఫొటో: అమెజాన్‌.కామ్‌)

1960 సెప్టెంబర్‌ 22న అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌.. ఇల్లినాయిస్‌లోని ఓ ప్రాంతంలో పర్యటనకు వచ్చారట. అప్పుడు స్టీవ్‌జెన్నె వయసు పద్నాలుగు సంవత్సరాలు. నిక్సన్‌ రాక నేపథ్యంలో అక్కడి పాఠశాల యాజమాన్యం జెన్నెతోపాటు మరికొందరు విద్యార్థులను పర్యటనలో సహాయకులుగా పంపించింది. మధ్యాహ్నం స్థానిక పార్క్‌లో నిక్సన్‌ భోజనం చేశారు. ఆ సమయంలో జెన్నె.. నిక్సన్‌ వెనుకే నిలబడ్డాడు. నిక్సన్‌ శాండ్‌విచ్‌ తింటూ ఎంతో బాగుందంటూ కామెంట్‌ చేశారట. సగం శాండ్‌విచ్ తినేసి.. ప్రసంగం కోసం లేచి వెళ్లిపోయారట. అక్కడే నిల్చున్న జెన్నె వెంటనే మిగిలిన సగం శాండ్‌విచ్‌ను తీసుకొని దాచిపెట్టుకున్నాడు. ఇంటికొచ్చాక తన తల్లితో విషయం చెప్పి నిక్సన్‌ తిని వదిలేసిన సగం శాండ్‌విచ్‌ను భద్రపర్చమన్నాడట. అప్పుడు ఆమె శాండ్‌విచ్‌ను ఫ్రీజర్‌లో పెట్టింది. 1969లో నిక్సన్‌ అమెరికా అధ్యక్షుడయ్యారు. దీంతో దేశాధ్యక్షుడు తిని వదిలేసిన ఈ శాండ్‌విచ్‌ను ఎప్పటికీ తనతో ఉంచుకోవాలని జెన్నె భావించాడు. అలా దాన్ని ఫ్రీజర్‌లో పెట్టి ఆరు దశాబ్దాలుగా భద్రపరుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆ శాండ్‌విచ్‌ కోసమే ప్రత్యేక ఫ్రీజర్‌ ఏర్పాటు చేసి దానిపై ‘దాచిపెట్టండి.. పారేయొద్దు’అని రాసి పెట్టాడట. ఈ శాండ్‌విచ్‌పై జెన్నె ఒక పుస్తకం రాయడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని