Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగావైకుంఠ ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం దర్శనం ద్వారా భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు.

Updated : 13 Jan 2022 10:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి. కరోనా దృష్ట్యా పలు ఆలయాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కరోనా ఉద్ధృతితో కొన్ని ఆలయాలు వైకుంఠద్వార దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించాయి. 

 

శ్రీవారిని దర్శించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ

 తిరుమలలో బుధవారం అర్ధరాత్రి దాటాక 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో అర్చకులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. అనంతరం 1.45 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. బుధవారం రాత్రి తిరుమల చేరుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ దంపతులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం వేకువ జామున భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా, జేఎండీ సుచిత్రా ఎల్ల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.2కోట్ల విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన డీడీలను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌కు అందజేశారు. 

స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా దంపతులు, త్రిపుర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ దంపతులు, హైకోర్టు జడ్జీలు జస్టిస్‌ ఈశ్వరయ్య, జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ దుర్గాప్రసాద్‌, జస్టిస్‌ రమేష్‌, ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు జయరామ్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, రంగనాథరాజు, సురేష్‌, బాలినేని, అనిల్‌ యాదవ్‌ దంపతులు, అవంతి శ్రీనివాస్‌ దంపతులు, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు రోజా, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ సీఎం రమేశ్‌ దంపతులు, మాజీ మంత్రి చినరాజప్ప, లక్ష్మీపార్వతి, తెలంగాణ మంత్రి హరీశ్‌రావు దంపతులు, మరో మంత్రి గంగుల కమలాకర్‌  స్వామి వారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.

ప్రముఖులకు దర్శనం పూర్తయిన తర్వాత సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించారు. గురువారం నుంచి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తిరుమలకు చేరుకున్నారు.  ఏకాదశి పురస్కరించుకుని గురువారం ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని