Andhra News: ‘జడ్పీ ఛైర్మన్ అంటే ఆయనే..’ అనేలా పిన్నమనేని పనిచేశారు: ఉపరాష్ట్రపతి వెంకయ్య
రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు బాధ్యతాయుతంగా.. ఆచరణ సాధ్యమైనవే ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో రాజకీయ పార్టీల హామీలపై సమీక్ష జరగాలని వ్యాఖ్య
మచిలీపట్నం: రాజకీయ వ్యవస్థలో ఆచరణకు సాధ్యంకాని హామీలను ఇస్తున్నారనీ.. వీటిపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయ నాయకుడు రోజూ పడుకునేముందు తమ బాధ్యతల్ని ఈరోజు ఎంతవరకు చేశామో గుర్తుచేసుకోవాలని సూచించారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు అధికారమిస్తే ఎలా చేయవచ్చో నిరూపించిన వ్యక్తి పిన్నమనేని అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ అంటే కోటేశ్వరరావు అనే మాదిరిగా పనిచేశారంటూ కొనియాడారు. కృష్ణా జిల్లాకు 27ఏళ్లు జడ్పీ ఛైర్మన్గా పనిచేయడం సాధారణ విషయం కాదన్నారు. పార్టీ మారకుండా, పార్టీలకతీతంగా పనిచేస్తూ వెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
పిన్నమనేని అందరివాడు.. రాజకీయాలకే వన్నెతెచ్చారు
పేదల పక్షపాతి పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన రాజకీయాలకే వన్నె తెచ్చి ఆదర్శంగా నిలిచిన ఓ మంచి మనిషి జీవితం గురించి భవిష్యత్ తరాలు తెలుసుకునే అవకాశం కలగడం సంతోషదాకమన్నారు. ‘‘పరిణతి చెందిన రాజకీయాలకు నిలయంగా చెప్పుకొనే కృష్ణా జిల్లాకు 27 ఏళ్లు జిల్లా పరిషత్ ఛైర్మన్గా పని చేసిన కోటేశ్వరరావు గారు అందరివాడుగా పేరు సంపాదించుకున్నారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజల మనసుల్లో నాటుకుపోయాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఆయన ముందుకు సాగిన తీరు చిరస్మరణీయం. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు అందించేందుకు కృషి చేశారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులకు సన్మానాలు, పారితోషికాలు అందించే ఒరవడికి వారు శ్రీకారం చుట్టారు.కోటేశ్వరరావు గారి స్ఫూర్తి ఈతరం రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలి. మాటల్లో హుందాతనం, ఆహార్యంలో గౌరవ భావం, చేసే పనుల్లో నిజాయితీ, చిత్తశుద్ధి, కార్యదీక్ష వంటి అంశాలను వారి జీవితం తెలియజేస్తుంది. వారి ప్రేరణను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నా. రాజకీయాలు మాత్రమే కాదు, ఏ వ్యవస్థలో అయినా ఆరోగ్యకరమైన అభివృద్ధి అవసరం. ఆర్థికాభివృద్ధి ఆరోగ్యకరంగా ఉంటేనే సుస్థిరంగా ఉంటుంది. వ్యవస్థలోని లోపాలను ప్రక్షాళన చేసి, విలువలతో కూడిన గమ్యం దిశగా ప్రపంచం మళ్ళాలి. అప్పుడే మెరుగైన సమాజం సాధ్యమవుతుంది’’ అన్నారు.
ఆ కుటుంబంతో నాది ఆత్మీయ అనుబంధం
పిన్నమనేని కోటేశ్వరరావు కుటుంబంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. కృష్ణా జిల్లాకు 27ఏళ్లు జడ్పీ ఛైర్మన్గా పనిచేయడం సాధారణ విషయం కాదన్న వెంకయ్యనాయుడు.. ఆయన వ్యవహార శైలి చూస్తే అభివృద్ధే ప్రధాన అజెండాగా పనిచేశారని కొనియాడారు. జై ఆంధ్ర ఉద్యమం సమయంలో తాను ఇక్కడి వచ్చాననీ.. తనకూ ఆయనకు అభిప్రాయ బేధాలు వచ్చినా.. ఎక్కడా అభిప్రాయాలను మార్చుకోమని చెప్పలేదన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ అంటే కోటేశ్వరరావు అనే మాదిరిగా పనిచేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థలకు అధికారమిస్తే ఎలా చేయవచ్చని నిరూపించిన వ్యక్తి పిన్నమనేని అన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేశారంటూ ప్రశంసించారు.
కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేసిన పిన్నమనేని కోటేశ్వరరావు నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ పార్టీ మారకుండా, పార్టీలకు అతీతంగా పనిచేస్తూ వెళ్లారని వెంకయ్య నాయుడు తెలిపారు. నమ్ముకున్న పార్టీకి నమ్మకంగా ఉన్నారనీ.. ఆయన ఆచరించిన పద్ధతులు నేటి తరం రాజకీయ నాయకులు అలవరుచుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు మాట్లాడే భాషను సమీక్షించుకోవాలన్నారు. కులం, మతం, ప్రాంతీయతత్వం మంచిది కాదనీ.. అన్ని వర్గాల వారినీ సమానంగా చూడాలన్నారు. ఎవరికీ కులం తమ చేతిలో లేదన్న ఆయన.. కానీ కుల, మతతత్వం మంచిది కాదన్నారు. మన గుణం చూసే ప్రజలు మనల్ని గుర్తుంచుకుంటారని తెలిపారు. రాజకీయ వ్యవస్థలో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారనీ.. దీనిపై సమీక్ష జరగాలన్నారు. పత్రికలు కూడా ప్రజలకు సరైన సమాచారం అందించాలనీ.. సత్యానికి దగ్గరగా.. సంచలనానికి దూరంగా ఉండాలన్నారు.
కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు.. పిన్నమనేని కోటేశ్వరరావుదేనని జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. రాజకీయ, వ్యవసాయ రంగం సహా ఏ రంగంలోనైనా ఉమ్మడి జిల్లాలో ఆయన ప్రభావం వెలకట్టలేనిదన్నారు. జిల్లాలో అక్షరాస్యతను పెంచేందుకు అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో నిర్మించారన్నారు. 1987లో ఇబ్రహీంపట్నం నుంచి తన తండ్రి జోగి మోహన్ రావు ఎంపీపీగా పోటీచేశారని గుర్తు చేసిన మంత్రి జోగి రమేష్.. ఆ రోజుల్లోనే పిన్నమనేనిని గెలిపించాలంటూ గోడల మీద రాసే అదృష్టం, అవకాశం కలిగిందన్నారు. పిన్నమనేని నిర్మలచరుతులని, అజాత శత్రువంటూ మాజీ విజిలెన్స్ కమిషనర్ కె.వి చౌదరి కొనియాడారు. ఈ జీవితం ఉన్నంత వరకు కోటేశ్వరరావు కుటుంబ సభ్యుడిగానే తనని తాను భావిస్తానని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తే, ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేసినట్టు పిన్నమనేని కోటేశ్వరరావు కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేశ్, మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్