TS Inter exams: చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ఇంటర్‌ పరీక్షల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలంటూ తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై

Updated : 22 Oct 2021 15:40 IST

హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ మొదటి పరీక్షలు రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉండగా పిటిషన్‌ వేస్తే ఎలా అని ప్రశ్నించింది. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో తమ పిటిషన్‌ను తల్లిదండ్రుల సంఘం ఉపసంహరించుకుంది.

మరోవైపు, ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో కరోనాతో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో అందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేశారు. ఒకసారి ప్రమోట్‌ అయిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించడం సరికాదని, ఇప్పటికే వారంతా ద్వితీయ సంవత్సరం చదువుతున్నందున మళ్లీ మొదటి సంవత్సరం సబ్జెక్టులు చదవడంతో గందరగోళానికి, ఒత్తిడికి గురవుతారంటూ పిటిషనర్‌ పేర్కొన్నారు. మిగతా వారిలాగే వారందరినీ పాస్‌ అయినట్టు ప్రకటించాలని కోరుతూ నిన్న పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో ఈ మధ్యాహ్నం 2.30గంటల సమయంలో హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేసిన సందర్భంలోనే పరిస్థితిని బట్టి మళ్లీ పరీక్ష ఉంటుందని చెప్పామన్నారు. గతంలో ఈ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేదు.. ఇప్పుడు ఈ పరీక్షలు కూడా రాయకపోతే భవిష్యత్తులో ఏదైనా పరిస్థితులు ఎదురై ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాయకుంటే వారిని ఎలా ఎవాల్యుయేట్‌ చేయాలన్న అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో వాదోపవాదాలను సంగతి పక్కనబెట్టి.. అసలు చివరి నిమిషంలో పిటిషన్‌ వేస్తే ఎలా విచారణ జరపుతామంటూ అభ్యంతరం వ్యక్తంచేసింది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించగా.. తమ వారు పిటిషన్‌ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని