కిరాణా దుకాణానికెళ్తే.. కరోనా టీకా దక్కింది!

తమకు ఈ అవకాశం దక్కడం ఎంతో అదృష్టమని డేవిడ్‌ ఈ సందర్భంగా చెప్పాడు.

Published : 09 Jan 2021 00:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో ఎన్నో దేశాల మాదిరిగానే.. అమెరికా కూడా కొవిడ్‌ మహమ్మారితో యుద్ధం చేస్తోంది. అక్కడ ఇప్పటికే రెండు కోట్ల 21 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో తొలివిడత టీకాల పంపిణీ మొదలైనప్పటికీ..  వైద్యారోగ్య సిబ్బందికి, కరోనా యోధులకు, ఇతర అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే దానిని అందిస్తున్నారు. సాధారణ ప్రజలు టీకాను పొందేందుకు మరికొంత కాలం వేచి ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన టీకా అన్నట్టుగా.. కిరాణా దుకాణానికి వెళ్లిన యువకులకు అనుకోకుండా కరోనా టీకా లభించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

వాషింగ్టన్‌కు చెందిన డేవిడ్‌ మెక్‌ మిలన్‌ అనే న్యాయశాస్త్ర విద్యార్థి తన స్నేహితుడితో కలసి జైంట్‌ ఫుడ్‌ అనే సూపర్‌ మార్కెట్‌కు వెళ్లాడు. ఇంతలో అక్కడి ఫార్మసీ విభాగంలోని ఉద్యోగి వారిద్దరినీ పిలిచి మరీ కరోనా టీకా ఇచ్చారట. అనుకోని ఈ అవకాశానికి ఉబ్బితబ్బిబ్బయిన డేవిడ్‌.. అందుకు  సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. ఇక సోమవారం నుంచి ఇప్పటి వరకు దీనికి ఏడు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

ఇదెలా జరిగిందబ్బా..

నిజానికి అక్కడ టీకా వేయించుకునేందుకు కొందరు వైద్యారోగ్య సిబ్బంది రావాల్సి ఉంది. ఐతే అనుకోని కారణాల వల్ల వారు సమయానికి చేరలేకపోయారట. వారు వినియోగిస్తున్న మోడెర్నా టీకాను అతిశీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరచాలి. అలాకాకుండా ఫ్రీజర్ నుంచి ఒకసారి బయటకు తీసి మూతను తెరిస్తే.. దానిని వెంటనే వినియోగించాల్సిందే. ఈ పరిస్థితుల్లో టీకా వృథా కాకూడదని ఫార్మా సిబ్బంది.. అక్కడకు వచ్చిన వీరిద్దరికీ టీకా వేశారు.

కరోనా కారణంగా దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. తమకు ఈ అవకాశం దక్కడం ఎంతో అదృష్టమని డేవిడ్‌ ఈ సందర్భంగా చెప్పాడు. నూతన సంవత్సర ఆరంభంలోనే మహమ్మారిని ఎదుర్కొనే ఆయుధం తమకు లభించటం పట్ల వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి..

14 నుంచి 24 ఏళ్లకు రెండు నిముషాల్లో..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని