
గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడి మృతి
బీర్కూర్: కరోనా మహమ్మారి కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీర్కూర్ మాజీ ఎంపీపీ మల్లెల మీనా భర్త మల్లెల హన్మంతు(41), ఆయన తల్లి గంగమణి(70) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హన్మంతు తొలుత బోధన్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం అతను మళ్లీ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో హన్మంతు, మీనా, గంగమణికి పాజిటివ్గా తేలింది. మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగమణి ఆదివారం సాయంత్రం మృతి చెందగా.. హన్మంతు సోమవారం ఉదయం మృతి చెందారు. గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. వీరిద్దరికీ కొవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఆక్సిజన్ సరఫరా ట్రక్కులు ప్రారంభం
న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో నెలకొన్న ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆక్సిజన్ కొరత ఉన్న ప్రాంతాలకు ట్రక్కులు పంపిణీని కేంద్రం ప్రారంభించింది. రైల్వే ద్వారా దేశంలో పలు ప్రాంతాలకు ఆక్సిజన్ ట్రక్కుల రవాణాను సోమవారం సాయంత్రం నుంచే మొదలు పెడుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. భారత ఆర్మీ సహకారంతో దేశంలోని పలు ప్రదేశాలకు 32 వ్యాగన్లలో ఆక్సిజన్ ట్రక్కులు పంపుతున్న తెలిపింది. దిల్లీ సమీపంలోని పల్వల్ నుంచి విశాఖపట్నం వరకు 32 వ్యాగన్లతో కూడిన ప్రత్యేక రైలు బయలుదేరనుంది. ఇందుకోసం భారత సైన్యం వద్ద ఉన్న.. క్లిష్టమైన రోలింగ్ స్టాక్లను వినియోగించుకుంటున్నట్లు వెల్లడించింది.
లాక్డౌన్ ప్రకటన: మద్యం షాపుల ముందు క్యూ
దిల్లీ : దేశ రాజధాని ప్రాంతంలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఆరు రోజుల లాక్డౌన్ విధిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర సేవలు తప్ప ఎలాంటివాటికి అనుమతించబోమని స్పష్టం చేశారు. మరోవైపు లాక్డౌన్ ప్రకటనతో దిల్లీలో మద్యం దుకాణాలకు జనం ఒక్కసారిగా పోటెత్తారు. పలు చోట్ల భౌతిక దూరం, మాస్కులు ధరించకుండా పెద్దసంఖ్యలో బారులు తీరడం గమనార్హం. మద్యం దుకాణాల నిర్వాహకులు కూడా వారిని నియంత్రించ లేకపోతున్నారు.
దిల్లీలో ఇవాళ రాత్రి 10 నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్డౌన్ అమల్లో ఉండనుంది. కరోనా కట్టడి కోసం అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.