AP CMO: జగన్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

ఏపీ సీఎం జగన్‌ కార్యాలయం (సీఎంవో) సమీపంలో కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యకు యత్నించారు. బ్లేడుతో చేతి మణికట్టును కోసుకున్నారు.

Updated : 02 Nov 2022 22:17 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ కార్యాలయం (సీఎంవో) సమీపంలో కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యకు యత్నించారు. బ్లేడుతో చేతి మణికట్టును కోసుకున్నారు. వెన్నెముక సమస్యతో అచేతన స్థితిలో ఉన్న తన కుమార్తె సాయిలక్ష్మిచంద్రను కాపాడాలని వేడుకునేందుకు వచ్చానని.. సీఎంను కలవాలని భావిస్తుంటే తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆమె వాపోయారు. సీఎంవోలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో అధికారులను కలిసి వచ్చిన అనంతరం ఇక న్యాయం జరగదన్న ఆందోళనతో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు.

ఎమ్మెల్యేతో కలిసి రమ్మన్నారు.. ఎన్ని దిక్కులు పరిగెత్తాలి?

కుమార్తె చికిత్స కోసం అన్నవరంలోని తన ఇల్లు అమ్ముకోనీయకుండా మంత్రి దాడిశెట్టి రాజా గన్‌మెన్‌ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గన్‌మెన్‌, మరో కానిస్టేబుల్‌పై గతంలోనూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎవర్నీ ఇల్లు కొననీయకుండా చేస్తున్నారని కంటతడి పెట్టారు. తన కుమార్తె చికిత్సకు అయ్యే ఖర్చు అంచనాలు ఇవ్వాలని సీఎంవో అధికారులు సూచించారని.. ఖర్చులో 20-30 శాతమే ఇస్తామంటున్నారని చెప్పారు. సీఎంను కలవాలంటే ఎమ్మెల్యేతో కలిసి రావాలని అధికారులు చెప్పారని.. ఈ సమస్య పరిష్కారానికి ఎన్ని దిక్కులు పరిగెత్తాలని ఆరుద్ర కంటతడి పెట్టుకున్నారు.

తన కుమార్తెను బతికించుకోవాలంటే రూ.2కోట్లు ఖర్చు అవుతుందని ఆమె తెలిపారు. చికిత్సకు సాయం చేయక.. ఆస్తినీ అమ్ముకోనీయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. మంత్రి గన్‌మెన్‌ దౌర్జన్యాలపై సీఎంవో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కదల్లేక వీల్‌ఛైర్‌లో ఉన్న ఆమె కుమార్తె పరిస్థితిని చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మూడుసార్లు శస్త్రచికిత్స చేసినా నయంకాలేదు..

కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన రాజులపూడి ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మిచంద్రకు వెన్నెముకలో సమస్య తలెత్తింది. మూడుసార్లు శస్త్రచికిత్సలు చేయించినా నయం కాలేదు. కుమార్తె వైద్యం కోసం అన్నవరంలోని ఇంటిని అమ్ముదామని ప్రయత్నిస్తే... ఆ పక్కనే ఉండే ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుపడి రూ.40 లక్షల ఇంటిని రూ.10 లక్షలకు తమకే విక్రయించాలని వేధిస్తున్నారని ఆరుద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కాకినాడ స్పందనలో జేసీని కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. 

కుమార్తెకు శస్త్రచికిత్స చేయించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయమందించాలని సీఎంను కోరేందుకు మంగళవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి ఆరుద్ర వచ్చారు. సీఎం విజయవాడలో జరిగే వైఎస్సార్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి వెళ్లారని అధికారులు చెప్పడంతో బిడ్డను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. సీఎంను కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో మళ్లీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు ఆమె వెనుదిరిగారు. వీల్‌ఛైర్‌లో బిడ్డను కూర్చోబెట్టుకుని.. మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని తమకు చావే గతి అని మంగళవారం ఆరుద్ర కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం సీఎంను కలిసేందుకు మరోసారి యత్నించగా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని