Mask: మాస్కు ధరించలేదని మహిళపై ఖాకీల దాడి

కొవిడ్‌ నిబంధనల పేరుతో మధ్యప్రదేశ్‌ పోలీసులు రెచ్చిపోయారు. మాస్కు ధరించలేదనే కారణంతో ఓ మహిళపై ఆమె కుమార్తె ముందే పోలీసులు అమానుషంగా దాడికి ..

Updated : 21 May 2021 14:07 IST

రోడ్డుపైనే ఈడ్చుకుంటూ కొట్టిన మధ్యప్రదేశ్‌ పోలీసులు 


భోపాల్‌: కొవిడ్‌ నిబంధనల పేరుతో మధ్యప్రదేశ్‌ పోలీసులు రెచ్చిపోయారు. మాస్కు ధరించలేదనే కారణంతో ఓ మహిళపై ఆమె కుమార్తె ముందే పోలీసులు అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళను పోలీసులు నడిరోడ్డుపైనే  ఈడ్చుకుంటూ కొడుతూ, కాలితో తంతున్న దృశ్యాలను మొబైల్‌ ఫోన్‌లో ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.  ఓ మహిళ, ఆమె కుమార్తె నిత్యావసర సరకులు కొనేందుకు బయటకు వచ్చారు.  కొవిడ్‌ నిబంధనల పేరుతో మాస్కు ధరించలేదంటూ ఆ మహిళను ఇద్దరు పోలీసులు కొట్టారు.  వారి నుంచి విడిపించుకొనేందుకు ఆమె ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆమె పలుమార్లు రోడ్డుపై కింద పడిపోయింది. ఆమెను పోలీసు వాహనంలోకి ఎక్కించేందుకు ఓ మహిళా పోలీసు సైతం ప్రయత్నించగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. తల్లిని వారి నుంచి విడిపించేందుకు కుమార్తె చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆర్తనాదాలు చేస్తున్న ఆ మహిళ జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసులు  హింసకు పాల్పడ్డారు.  ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డయ్యాయి.  కొవిడ్ నిబంధనల పేరుతో ఇలాంటి అమానుషాలకు పాల్పడటం మధ్యప్రదేశ్‌ పోలీసులకు కొత్తేమీ కాదు. మాస్కు ధరించలేదనే కారణంతో ఇండోర్‌లో ఓ వ్యక్తిపై పోలీసులు గత నెల ఇదే విధంగా హింసకు దిగారు. కరోనా నిబంధనల ఉల్లంఘన పేరుతో దేశవ్యాప్తంగా గత నెల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో పోలీసులపై చాలా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది.   


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు