Kavitha: కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలు.. విచారణకు మహిళా కమిషన్‌ ఆదేశం

ఎమ్మెల్సీ కవితపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై విచారణ జరపాలని డీజీపీకి కమిషన్‌ ఆదేశించింది.

Updated : 11 Mar 2023 15:12 IST

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో (Delhi liquor scam) ఈడీ నోటీసు అందుకున్న భారాస ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ (womens commission) ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా సంజయ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసి.. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించనున్నట్లు సమాచారం. సంజయ్‌ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్‌.. ఆ వ్యాఖ్యలపై విచారణ జరపాలని డీజీపికి ఆదేశించింది.

మరోవైపు కవిత ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా నగరంలోని పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారాస శ్రేణులు, నేతలు పలు చోట్ల దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ఆందోళనకు దిగారు. వెంటనే సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని.. కవితకు క్షమాపణ చెప్పాలని భారాస కార్యకర్తలు డిమాండ్ చేశారు. దిల్లీలో కవిత విచారణ, నగరంలో భారాస ఆందోళనల దృష్ట్యా నగరంలోని బషీర్‌బాగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయానికి తాళాలు వేసి.. పోలీసులు భారీగా మోహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు