Andhra News: మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో భాష కూడా అంతే: వెంకయ్యనాయుడు
స్వభాషను రక్షించుకుందాం.. స్వాభిమానం పెంచుకుందాం నినాదంతో విజయవాడ సిద్దార్ధ అకాడమీలో ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
విజయవాడ: భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలని తెలుగు భాషాభిమానులు ఆకాంక్షించారు. మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో భాష కూడా అంతేనని పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిలషించారు. తల్లిదండ్రులు తమ ఇంటి నుంచే అమ్మభాషను కాపాడేందుకు నడుంబిగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని, పరిపాలన భాష మాతృభాషలోనే సాగాలని, న్యాయవ్యవస్థలో వాదనల నుంచి తీర్పుల వరకు అన్నీ తెలుగులోనే జరగాలని.. ఉన్నత సాంకేతిక విద్యను మాతృభాషలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. స్వభాషను రక్షించుకుందాం.. స్వాభిమానం పెంచుకుందాం నినాదంతో విజయవాడ సిద్ధార్థ అకాడమీలో ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలను వెంకయ్యనాయుడు, కృష్ణా రచయితల సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిలికానాంధ్ర, సిద్దార్ధ అకాడమీ ప్రతినిధులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రాజరాజనరేంద్ర సభా ప్రాంగణంలో ఆదికవి నన్నయ్య వేదికపై మహాసభలు నిర్వహిస్తున్నారు. పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ పేరిట మరో రెండు వేదికలను కూడా అనుబంధ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు. సిలికానాంధ్ర ఆధ్వర్యంలో కోటి మాటల కోట, రాజరాజనరేంద్ర పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రచనల ద్వారానే భాషా సంస్కృతులు ముందు తరాలకు చేరుతాయని అన్నారు. దేశ వైభవాన్ని.. ఆ దేశంలో పుట్టిన సాహిత్యం ప్రతిబింబిస్తుందన్నారు. తెలుగు భాష ఎంతో ప్రాచీనమైందని, పుష్కలమైన సాహిత్య, భాషా సంపద కలిగిన తెలుగులో 11వ శతాబ్దం నుంచే కావ్యరచన ప్రారంభమై, శాఖోపశాఖలుగా విస్తరించిందని వివరించారు. తెలుగు భాష వైభవాన్ని అవధానం, శతక సాహిత్యం వంటివి మరింత పెంపొందింపజేశాయని తెలిపారు. మన సామెతలు ఎన్నో జీవిత సత్యాలు నేర్పుతాయని.. వేమన, సుమతి శతకాలు నాణ్యమైన జీవితాన్ని ఎలా జీవించాలో తెలియజేస్తాయన్నారు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య లాంటి మహనీయుల కీర్తనలు ఆధ్యాత్మికతలోని అసలు అర్థాన్ని వివరిస్తాయన్నారు. ఇంత ఘనమైన సాహితీ సంపద ఉన్న తెలుగు భాషను పరిరక్షించి ముందు తరాలకు అందజేసినప్పుడే మన సంస్కృతి, సంప్రదాయాలు మనుగడ సాగిస్తాయన్నారు.
ఐదు అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి..
మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు. వీటిలో మొదటిది ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండేలా చూడటం. రెండోది పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం. మూడోది న్యాయస్థానాల కార్యకలాపాలు సైతం మాతృభాషలోనే సాగించటం. తీర్పులు కూడా అందులోనే వచ్చేలా చొరవ తీసుకోవటం. నాలుగోది ఉన్నత, సాంకేతిక విద్య స్వదేశీభాషల వినియోగం క్రమంగా పెంచడం, ఐదోది .. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో, కుటుంబ సభ్యులతో మాతృభాషలోనే మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా మాతృభాష పరిరక్షణ ప్రజా ఉద్యమం కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. సమాజంలో పేరుకుపోయిన జాడ్యాలకు వ్యతిరేకంగా రచయితల కలం కదం తొక్కాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, పద్మశ్రీ పురస్కార గ్రహీత కొలకలూరి ఇనాక్, ఫ్రాన్స్ తెలుగు ఆచార్యులు డేనియల్ నెగర్స్, తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు తోటకూర ప్రసాద్, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభల్లో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి సుప్రసిద్ధ తెలుగు రచయితలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు