తొలి కారు ప్రమాదం ఎప్పుడు.. ఎక్కడ జరిగిందో తెలుసా?

వార్త పత్రికలు చదివినా. టీవీలో వార్తలు చూసినా.. లారీని ఢీకొన్న కారు, అదుపుతప్పి బోల్తా పడ్డ కారు, నదిలోకి దూసుకెళ్లిన కారు అంటూ అనేక రోడ్డు ప్రమాద వార్తలు కనిపిస్తుంటాయి. కానీ, తొలి కారు ప్రమాదం ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా?

Published : 01 Jul 2021 01:23 IST

(Photo: ohiohistorycentral.org)

ఇంటర్నెట్‌ డెస్క్‌: వార్తా పత్రికలు చదివినా, టీవీలో వార్తలు చూసినా ఏదోఒక చోట లారీని ఢీకొన్న కారు, అదుపు తప్పి కారు బోల్తా, నదిలోకి దూసుకెళ్లిన కారు.. అంటూ అనేక రకాల ప్రమాద వార్తలు కనిపిస్తుంటాయి. కానీ, తొలి కారు ప్రమాదం ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా? అయితే.. ఇది చదవండి.. 

అమెరికాలోని ఒహైయో రాష్ట్రంలో ఉన్న క్లేవ్‌లాండ్‌లో 1891లో తొలి కారు ప్రమాదం జరిగింది. అంతకుముందు నుంచే కార్లు ఉన్నా.. స్టీమ్‌ ఇంజిన్‌తో పనిచేసేవి. వాటిని ప్రస్తుత కార్లతో పోల్చలేం. అందుకే వాటి ప్రమాదాలను చరిత్రకారులు కారు ప్రమాదం కింద లెక్కకట్టలేదు. జాన్‌ విలియమ్‌ లాంబెర్ట్‌ సొంతంగా కారు తయారు చేసి, నడిపిస్తుండగా జరిగిన ప్రమాదాన్నే ప్రపంచంలోనే తొలి కారు ప్రమాదంగా పేర్కొంటారు. 

ఇంతకీ ఆ ప్రమాదం ఎలా జరిగిందంటే.. ఒహైయో రాష్ట్రానికి చెందిన జాన్‌ విలియమ్‌ లాంబెర్ట్‌ ఒక మెకానికల్‌ ఇంజినీర్‌. ఆయన కనిపెట్టిన వాటిల్లో 600 వస్తువులకు పేటెంట్‌ హక్కులు కూడా పొందారు. కాగా.. అమెరికాలోనే తొలిసారి గ్యాసోలిన్‌ ఆటోమొబైల్‌ కారును 1890-91లో లాంబెర్టే తయారు చేశారు. ప్రస్తుత కార్లకు ప్రేరణగా నిలిచింది ఈ కారేనట. కారు పనితీరు పరిశీలనలో భాగంగా లాంబెర్ట్‌ 1891లో జేమ్స్‌ స్వేవ్లాండ్‌ అనే స్థానిక వ్యాపారవేత్తను కారులో కూర్చొబెట్టుకొని ఒహైయో సిటీ ప్రాంతంలో తిరిగారు. అలా కారులో తిరుగుతుండగా.. ఓ చోట చెట్టు వేర్లు కారు చక్రాలకు తగలడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కంచెను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత లాంబెర్ట్‌ కారులో మరిన్ని మార్పులు చేసి కొత్త డిజైన్‌తో మరో కారును తయారు చేశారు. ఆటోమొబైల్‌ సంస్థను నెలకొల్పి కార్లను తయారు చేసి విక్రయించారు. దీంతో వ్యాపారవేత్తగానూ లాంబెర్ట్‌ పేరు సంపాదించారు. రెండు కార్లు ఢీకొన్న ఘటన కూడా ఒహైయో నగరంలోనే జరిగిందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి మాత్రం సరైన ఆధారాలు లేవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు