సారీ..స్విగ్గీ: జొమాటో

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ పొరపడి పెట్టిన ట్వీట్‌కు ముంబయి పోలీసులు స్పష్టత ఇచ్చారు

Published : 16 Apr 2021 01:18 IST

మహారాష్ట్రలో ఆంక్షలు..పొరబడిన సంస్థ

ముంబయి: ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ పొరపడి పెట్టిన ట్వీట్‌కు ముంబయి పోలీసులు స్పష్టత ఇచ్చారు. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కారణంగా ఇటీవల అక్కడి ప్రభుత్వం రాత్రి ఎనిమిది నుంచి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను విధించింది. అత్యవసర సేవలకు మాత్రం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే దీపిందర్ ట్వీట్ చేశారు. ‘ముంబైలో రాత్రి ఎనిమిది తరవాత అవసరమైన ఫుడ్ డెలివరీ చేయడానికి జొమాటో సిద్ధం. అయితే మేం చట్టానికి కట్టుబడి ఉంటున్నాం. కానీ పోటీ సంస్థ రాత్రి ఎనిమిది తరవాత కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీనిపై ముందుకెళ్లే మార్గాన్ని స్పష్టం చేయమని ముంబయి పోలీసుల్ని కోరుతున్నాను’ అంటూ దీపిందర్‌ స్విగ్గీ హోం పేజీని షేర్ చేశారు.

 ఆయన చేసిన అభ్యర్థనకు ముంబయి పోలీసులు వెంటనే స్పందించారు. ‘ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఒకసారి గమనించండి. వాటిలో హోం డెలివరీకి అనుమతించింది. ఎక్కడ కూడా కాలపరిమితి విధించలేదు’ అని జవాబిచ్చారు. దీనిపై ముంబయి పోలీసులకు దీపిందర్ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే స్విగ్గీని ట్యాగ్ చేసి..‘క్షమాపణలు, మాకు మరో అవకాశం లేదు’ అంటూ వ్యాఖ్యను జోడించారు. అయితే జొమాటో సీఈఓ వైఖరిని మాత్రం నెటిజన్లు తప్పు పడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని