Afghanistan: తాలిబన్ల చేతికి కీలక జాబితా.. అమెరికా భారీ తప్పిదం!

అఫ్గానిస్థాన్‌ వ్యవహారంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. అక్కడి నుంచి తమ దళాలను హడావుడిగా ఉపసంహరించుకోవడం మొదలు... కాబుల్‌ విమానాశ్రయం నుంచి ప్రజలను సురక్షితంగా

Updated : 28 Aug 2021 07:11 IST

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ వ్యవహారంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. అక్కడి నుంచి తమ దళాలను హడావుడిగా ఉపసంహరించుకోవడం మొదలు... కాబుల్‌ విమానాశ్రయం నుంచి ప్రజలను సురక్షితంగా తరలించడం వరకు ఎన్నో విషయాల్లో అగ్రరాజ్యం విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. ఈ క్రమంలోనే అమెరికా భారీ తప్పదం చేసిందంటూ మీడియాలో తీవ్ర ఆందోళన కలిగించే కథనం సంచలనం సృష్టిస్తోంది. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించిన క్రమంలో... తమ పౌరులు, మిత్రదేశాల వారు, ఇన్నాళ్లూ తమకు సహకరించిన అఫ్గాన్ల పేర్లతో అమెరికా ప్రత్యేకంగా ఓ జాబితాను రూపొందించింది. ఆగస్టు 31లోగా తమ బలగాలను ఉపసంహరించుకోవాలి కాబట్టి... వీరందర్నీ కాబుల్‌ నుంచి సురక్షితంగా తరలించేందుకు తాలిబన్లు సహాయపడతారని భావించింది. అమెరికా అధికారులు స్వయంగా వచ్చి, తాలిబన్ల చేతుల్లో ఈ జాబితాను పెట్టారు! ఈ లిస్టును తాలిబన్లకు అందిస్తే, ప్రజల తరలింపు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని అగ్రరాజ్యం భావించింది.

కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ‘మేకవన్నె పులి’ చందంగా తాలిబన్లు పైకి తాము మారామని, అందర్నీ క్షమిస్తున్నామని చెబుతున్నా... ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టి, గతంలో నాటో దళాలకు సహాయపడిన వారిని పట్టుకుంటున్న సంగతిని అమెరికా అధికారులు విస్మరించారు! ఇప్పుడు ఈ జాబితాను తాలిబన్లు ‘కిల్‌ లిస్ట్‌’గా పరిగణించే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం ఈ జాబితా విషయమై అధ్యక్షుడు బైడెన్‌ను విలేకరులు ప్రశ్నించారు. అయితే, దీన్ని ఆయన ఖండించలేదు. ఈ విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని, అప్పుడప్పుడు తాలిబన్లకు జాబితాలు ఇస్తుంటామని వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వ తీరుపై ఆ దేశ చట్టసభ్యులు, సైనికాధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. జాబితాలో పేర్లున్న అఫ్గాన్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. పౌరులకు ప్రమాదం తలపెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఇలా చేశామంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని