
పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్ల వీరమరణం
జమ్మూకశ్మీర్: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మరోసారి భారీ కాల్పులకు తెగబడింది. రాజౌరి జిల్లాలో పాక్సైన్యం జరిపిన రేంజర్ల దాడిలో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ జరిపిన దాడులపై భారత సైన్యం కూడా వెంటనే స్పందించినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నాయక్ ప్రేమ్ బహదూర్, రైఫిల్మ్యాన్ సుక్బీర్సింగ్ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయనట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. జవాన్ల త్యాగం, దేశభక్తికి యావత్ దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, నియంత్రణ రేఖ వెంట నిత్యం ఏదో ఒకచోట పాకిస్థాన్ ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఉంది. ఇంతకు ముందు రోజు పూంచ్ జిల్లాలోని క్వాస్బా, కిర్నీ సెక్టార్లలో అప్రకటిత దాడులకు పాల్పడింది. ఆ ఘటనలోనూ ఓ జవాను ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో పౌరుడు తీవ్ర గాయాలపాలయ్యారు.