శిందే సర్కారు ముందు.. 31 మంది ముప్పు: ఠాక్రే వర్గం ఆరోపణ

Maharashtra: తమపై భాజపా సవతి తల్లి ప్రేమ చూపుతోందని శిందే వర్గం నేతలు చేసిన వ్యాఖ్యలపై సామ్నా పత్రిక స్పందించింది. భాజపా, శిందే వర్గం మధ్య లవ్‌ అఫైర్ ముగిసిందని వ్యాఖ్యానించింది. 

Published : 30 May 2023 16:22 IST

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గానికి(Eknath Shinde's Shiv Sena) చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు భాజపా(BJP) తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారని ఉద్ధవ్‌ వర్గం శివసేన పత్రిక సామ్నా( Saamana)పేర్కొంది.  వారంతా శివసేన(శిందే వర్గం)ను వీడాలనుకుంటున్నారని రాసుకొచ్చింది.

‘శిందే వర్గానికి చెందిన చట్టసభ సభ్యులు ఎంతో అసౌకర్యంగా ఉన్నారని, భాజపా వారిపై చూపుతోన్న సవతి తల్లి ప్రేమే అందుకు కారణమని తెలుస్తోంది. వారంతా ఆ గ్రూప్‌ను వీడాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఠాక్రేకు నమ్మకద్రోహం చేసి, భాజపాతో చేతులు కలిపారు. ఒక ఏడాదిలోనే వారి లవ్‌ అఫైర్ కాస్తా.. బీటలు వారింది. ఇప్పుడు విడాకుల గురించి చర్చలు నడుస్తున్నాయి’అని సామ్నా దుయ్యబట్టింది. 

కొద్దిరోజుల క్రితం శివసేన(శిందే) ఎంపీ గజానన్‌ కీర్తికార్‌ చేసిన వ్యాఖ్యలే సామ్నా స్పందనకు కారణమని తెలుస్తోంది. ‘మేం ఎన్డీఏలో భాగం. కానీ మాకు అందులో సవతి తల్లి ప్రేమే దక్కుతుంది’ అని గజానన్ వ్యాఖ్యానించారు. అధికారాలను పంచుకునే విషయంలో విభేదాలతో 2019లో శివసేన.. భాజపాకు దూరం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్‌, ఎన్‌సీపీతో కలిసి మహారాష్ట్ర(Maharashtra)లో అధికారంలోకి వచ్చింది. గత ఏడాది శివసేనలో చీలిక రావడంతో.. ఏక్‌నాథ్‌ శిందే వెంట వెళ్లిన నేతలు భాజపాతో చేతులు కలిపారు. దాంతో  కూటమి ప్రభుత్వం కూలిపోయి.. శివసేన(శిందే), భాజపా అధికారంలోకి వచ్చాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని