2-DG ఔషధం: భారీ ఉత్పత్తికి సన్నాహాలు..!

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధిచేసిన 2డీజీ కొవిడ్‌ ఔషధం కరోనా చికిత్సలో సత్ఫలితాలిస్తున్న వేళ.. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాటి ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.

Published : 22 May 2021 01:28 IST

మరో నాలుగు సంస్థలకు అనుమతిచ్చే యోచనలో ప్రభుత్వం

దిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధిచేసిన 2డీజీ కొవిడ్‌ ఔషధం కరోనా చికిత్సలో సత్ఫలితాలిస్తున్న వేళ.. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాటి ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 2 డీజీ ఔషధాల తయారీకి మరో మూడు, నాలుగు సంస్థలకు అనుమతివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2డీజీ ఔషధంపై కొవిడ్‌ బాధితులు, వారి కుటుంబసభ్యుల నుంచి సానుకూలత వ్యక్తమవుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, వీటి వినియోగానికి అనుమతి ఉన్నప్పటికీ కొరత కారణంగా వాటిని పొందలేకపోతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు కేవలం పదివేల 2డీజీ ఔషధాలను మాత్రమే తయారీ సంస్థలు సరఫరా చేయడంతో వాటి ఉత్పత్తి మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పొడి రూపంలో ఉండే 2-డియాక్సీ-డి-గ్లూకోజ్‌ (2-డీజీ) ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసింది. ఆక్సిజన్‌ అవసరమైన కొవిడ్‌ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తున్నట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్‌ రూపంలో ఉన్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) ఇటీవల అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది. కొవిడ్‌ మహమ్మారిపై యావత్‌ దేశం పోరాటం చేస్తోన్న వేళ.. కొత్త ఆశాకిరణంలా 2-డీజీ ఔషధాన్ని డీఆర్‌డీవో అందుబాటులోకి తీసుకొచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని