Viral Video: యువతిని కిడ్నాప్ చేసి ఎడారిలో ‘సప్తపది’.. పోలీసులేం చెప్పారంటే?

తనతో నిశ్చితార్థాన్ని యువతి కుటుంబ సభ్యులు రద్దుచేశారన్న అక్కసుతో ఆమెను ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 07 Jun 2023 20:40 IST

జైపూర్‌: రాజస్థాన్‌(Rajasthan)లోని జైసల్మేర్‌లో ఓ యువతి(23)ని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకొనేందుకు ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు పుష్పేంద్రసింగ్‌ (29)తో పాటు ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. యువతితో తన నిశ్చితార్థాన్ని ఆమె కుటుంబం రద్దు చేసిన తర్వాత నిందితుడు ఆమెను ఎత్తుకెళ్లి వివాహం(Wedding) చేసుకొనేందుకు ప్రయత్నించాడని తెలిపారు.  జైసల్మేర్‌కు చెందిన యువతిని పుష్పేంద్ర, అతడి అనుచరులు బలవంతంగా ఎడారిలోకి తీసుకెళ్లిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆమె ఏడుస్తున్నా పట్టించుకోకుండా చేతులతో ఎత్తుకొని గడ్డితో వేసిన మంట చుట్టూ ఏడుసార్లు తిరిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

ఈ ఘటనపై నచ్నా సర్కిల్‌ ఆఫీసర్‌ కైలాష్‌ వైష్ణోయ్‌ మాట్లాడుతూ.. ‘‘షంకాల గ్రామానికి చెందిన యువతికి పుష్పేంద్రసింగ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు దాన్ని రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో జూన్‌ 1న పుష్పేంద్ర సింగ్‌ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. యువతిని రక్షించి అదేరోజు సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా.. ఒకరిని నిర్బంధంలోకి తీసుకున్నాం. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నాం’’ అని వివరించారు.

మరోవైపు, ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని దిల్లీ మహిళా కమిషనర్‌ స్వాతి మాలివాల్‌ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఆమె.. ‘‘ఈ వీడియో జైసల్మేర్‌ ఘటనకు సంబంధించినది. నిందితులు ఓ యువతిని బహిరంగంగా కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇది నిజంగా ఓ షాకింగ్‌..  చాలా భయానక ఘటన.  దీనిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ ఘటనను రాజస్థాన్‌ ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్‌, కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ఖండించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని