బిహార్‌లో 500 మంది డాక్టర్లకు కరోనా 

కొవిడ్‌ మహమ్మారిపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రోగులకు నిరంతరం చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది

Published : 22 Apr 2021 12:26 IST

పట్నా: కొవిడ్‌ మహమ్మారిపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ రోగులకు నిరంతరం చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది డాక్టర్లు వైరస్‌ కాటుకు గురవుతున్నారు. తాజాగా బిహార్‌లోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో 500 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. 

కరోనా రెండో దశలో రాష్ట్రంలోని ఎయిమ్స్‌, పట్నా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఇప్పటివరకు 500 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఎయిమ్స్‌లో మొత్తం 384 మంది సిబ్బందికి వైరస్‌ సోకగా.. ఇందులో అత్యధికంగా డాక్టర్లు, నర్సులు ఉన్నట్లు ఆసుపత్రి మెడికల్‌ సూపరిండెంట్‌ సీఎం సింగ్‌ తెలిపారు. ఇక పట్నా మెడికల్‌ కాలేజీలో 70 మంది వైద్యులు సహా 125 మంది ఆరోగ్య సిబ్బందికి కొవిడ్ సోకింది. 

రాష్ట్ర రాజధానిలో ఎయిమ్స్‌, పట్నా మెడికల్‌ కాలేజీతో పాటు నలంద మెడికల్‌ కాలేజీలో అత్యధికంగా కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ ఆసుపత్రుల్లోని సిబ్బందికి కూడా ముప్పు పెరిగిందని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఆయా ఆసుపత్రుల్లో సిబ్బందిని ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచారు. అయితే డాక్టర్లు అధిక సంఖ్యలో కరోనా బారినపడటంతో ఇక్కడ సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో ఈ ఆసుపత్రుల్లో మిగతా వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. 

బిహార్‌లో రెండో దశ కరోనా ఉద్ధృతి విపరీతంగా ఉంది. బుధవారం అక్కడ 12వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 56 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 63వేలకు పైగా క్రియాశీల కేసులున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని