Republic Day: పాక్‌ పాలకుడు గణతంత్ర వేడుకలకు వచ్చిన వేళ..

గణతంత్ర దినోత్సవం నాడు విదేశీ అతిథికి ఆతిథ్యం ఇవ్వడం భారత్‌లో కీలకమైన సంప్రదాయంగా వస్తోంది. దీనిలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. సరిహద్దుల్లో పాక్‌ సేనలు రెచ్చిపోతున్నా.. ఆ దేశ మంత్రికి ఆతిథ్యమిచ్చిన చరిత్ర ఉంది. 

Updated : 23 Jan 2024 16:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత గణతంత్ర దినోత్సవానికి ఓ దేశాధినేత అతిథిగా రావడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కొవిడ్‌-19 కారణంగా 2021, 2022 రిపబ్లిక్‌ డే పరేడ్‌లకు విదేశీ నేతలు ఎవరూ హాజరు కాలేదు. బరాక్‌ ఒబామా(అమెరికా), నెల్సన్‌ మండేలా(దక్షిణాఫ్రికా), పుతిన్‌(రష్యా), షింజో అబే(జపాన్‌) వంటి మహామహులు గతంలో హాజరయ్యారు. ఒకసారి పాకిస్థాన్‌ పాలకుడు.. మరోసారి చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సైనిక నేత వంటి వారు కూడా పాల్గొన్నారు. 

* 1950లో తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా ప్రెసిడెంట్‌ సుకర్ణో హాజరయ్యారు. భారత ప్రధాని నెహ్రూతో కలిసి అలీనోద్యమ సంస్థ ‘నామ్‌’ను స్థాపించారు. నెహ్రూ - సుకర్ణో మంచి మిత్రులు. భారత్‌ తొలి గణతంత్ర వేడుకలు దిల్లీలోని ఇర్విన్‌ స్టేడియంలో జరిగాయి.

* 1955లో పాక్‌ గవర్నర్‌ జనరల్‌ మాలిక్‌ గులాం మహమ్మద్‌ను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇరు దేశాలు ఒకే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయని.. వాటిని సమన్వయంతో పరిష్కరించుకొని మందుకు పోవాలని ఈ సందర్భంగా గులాం మహమ్మద్‌ వ్యాఖ్యానించారు. 

* 1958 జనవరి 22 నుంచి మార్చి 3వ తేదీ వరకు భారత్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీ సైనిక నాయకుడు యె జియాన్‌యింగ్‌ భారత్‌లో పర్యటించారు. ఆయన రిపబ్లిక్‌ డే సంబరాల్లో పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఏకైక చైనా నాయకుడు ఆయనే. 

* బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ ఫిలిప్‌, క్వీన్‌ ఎలిజబెత్‌ ఇద్దరు వేర్వేరు సందర్భాల్లో భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు. 1958లో ప్రిన్స్‌ ఫిలిప్‌ పాల్గొనగా.. 1961లో క్వీన్‌ ఎలిజబెత్‌కు ఆతిథ్యం ఇచ్చాం. వేర్వేరుగా రిపబ్లిక్‌ డే ఆతిథ్యం స్వీకరించిన జంట వీరే.

* 1965లో నాటి పాక్‌ ఆహారశాఖ మంత్రి రాణా అబ్దుల్‌ హమీద్‌ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. అప్పటికే గుజరాత్‌లోని కచ్‌ వద్ద భారత్‌- పాక్‌ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని నెలలకే ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. 

* 1966 జనవరి 11న ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణం కారణంగా భారత్‌ గణతంత్ర దినోత్సవానికి విదేశీ అతిథిని ఆహ్వానించలేదు. ఆ తర్వాత 13 రోజుల పాటు గుల్జారీ లాల్‌ నందా తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు. రిపబ్లిక్‌డేకు రెండు రోజుల ముందు ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 

* ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు జాక్వెస్‌ షిరాక్‌ రెండు సార్లు.. రెండు హోదాల్లో భారత గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు. 1976లో ఫ్రాన్స్‌ ప్రధాని హోదాలో హాజరుకాగా.. 1998లో ఆ దేశ అధ్యక్షుడి హోదాలో పాల్గొన్నారు. 

* భూటాన్‌ పాలకులు జిగ్మే డోర్జి వాంగ్‌చుక్‌(1954), జిగ్మే సింగే వాంగ్‌చుక్‌ (1984, 2005), జిగ్మే ఖేసర్‌ నాంగ్యాల్‌ వాంగ్‌చుక్‌ (2013)లో గణతంత్ర దినోత్సవ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన తండ్రి, కుమారుడు, మనమడు వీరే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని