Corona Virus: మహారాష్ట్రలో భారీగా కొవిడ్‌ కేసులు.. తొమ్మిది మంది మృతి

దేశంలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 9మంది కొవిడ్‌ బాధితులు మృతిచెందారు.

Published : 12 Apr 2023 20:54 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌(Corona virus) మళ్లీ పడగ విప్పుతోంది.  గడిచిన 24గంటల వ్యవధిలో అక్కడ 1,115 కొత్త కేసులు నమోదు కాగా.. ఈ ఇన్ఫెక్షన్‌ బారిన పడినవారిలో తొమ్మిది మంది మృత్యువాతపడినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 5,421కి పెరిగింది. వీటిలో ఒక్క ముంబయి నగరంలోనే 1577 కేసులు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఇప్పటివరకు మహారాష్ట్రలో 81,52,291 మందికి కరోనా సోకగా.. 1,48,470మంది ప్రాణాలు (ముంబయిలో 19,752మంది) కోల్పోయారు. 

మరోవైపు, ఒమిక్రాన్‌ ఉపరకం XBB.1.16 ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టు ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే ఉండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని సూచిస్తున్నాయి. దేశంలో తాజాగా 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు ఏడు నెలల తర్వాత ఇంత భారీగా కేసులు నమోదవడం మరోసారి కలవరపెడుతోంది. ఇదిలా ఉండగా..  దేశంలో కరోనా ఎండెమిక్‌ దశకు చేరుకుంటోందని.. అందువల్లే రాబోయే 10 నుంచి 12 రోజుల పాటు కొత్త కేసులు పెరుగుతాయని.. ఆ తర్వాత వైరస్‌వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని