SpiceJet: 24రోజుల్లో తొమ్మిదో ఘటన.. మరో స్పైస్‌జెట్‌ విమానంలో సమస్య!

దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ (spicejet) విమానాల్లో వరుసగా తలెత్తుతోన్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. ......

Published : 12 Jul 2022 18:36 IST

దిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ (spicejet) విమానాల్లో వరుసగా తలెత్తుతోన్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఆ సంస్థకు చెందిన బోయింగ్‌ బి737 మ్యాక్స్‌ విమానం నోస్‌ వీల్‌ పనిచేయకపోవడంతో దుబాయి నుంచి మదురై వెళ్లే విమానంలో జాప్యం చోటుచేసుకుంది. గత 24 రోజుల వ్యవధిలోనే స్పైస్‌జెట్‌ విమానాల్లో తలెత్తిన సమస్యల్లో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ VT-SZK నంబర్‌ కలిగిన బోయింగ్‌ బి737 మ్యాక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను స్పైస్‌జెట్ మంగళూరు నుంచి దుబాయికి ప్రయాణించింది. ఆ విమానం ల్యాండ్‌ కాగానే ఇంజినీర్‌ తనిఖీ చేయగా.. నోస్‌ వీల్‌లో లోపం ఉన్నట్టు గుర్తించినట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అధికారులు వెల్లడించారు. అయితే, ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్‌ తిరిగి దుబాయి-మదురై వెళ్లే ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ముంబయి నుంచి దుబాయికి పంపినట్టు డీజీసీఏ తెలిపింది. ఆఖరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే తమ విమాన సర్వీసు ఆలస్యమైనట్టు ఎయిర్‌లైన్స్‌ సంస్థ వివరణ ఇచ్చినట్టు పేర్కొంది. 

‘‘జులై 11న స్పైస్‌జెట్‌ విమానం ఎస్‌జీ23 దుబాయి నుంచి మదురైకి వచ్చే విమానం ఆలస్యమైంది. ఆఖరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ప్రయాణికుల్ని దుబాయి నుంచి మదురై తీసుకొచ్చేందుకు  ప్రత్యామ్నాయ విమానాన్ని తక్షణమే ఏర్పాటు చేశాం. ఏ ఎయిర్‌లైన్‌లో అయినా ఆలస్యం అవుతుంటుంది. విమానంలో ఎలాంటి ప్రమాదం జరగలేదు, భద్రతాపరమైన ఆందోళనా తలెత్తలేదు’’ అని స్పైస్‌జెట్‌ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 

మొన్న ఒక్కరోజే మూడు ఘటనలు..

మరోవైపు, స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం గత 24 రోజుల్లో ఇది తొమ్మిదోది కావడం గమనార్హం. ఇందులో మూడు ఘటనలు ఈ నెల 5నే చోటుచేసుకున్నాయి. దిల్లీ నుంచి దుబాయి వెళ్తోన్న స్పైస్‌జెట్‌ విమానం ఒకటి పాక్‌ గగనతలంలో ఉండగా.. ఇంధన ఇండికేటర్‌ సరిగా పనిచేయలేదు. దీంతో విమానాన్ని వెంటనే కరాచీకి దారిమళ్లించారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే గుజరాత్‌లోని కాండ్లా నుంచి ముంబయి వెళ్తోన్న మరో స్పైస్‌జెట్ విమానంలో.. 23వేల అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్‌కు పగులు ఏర్పడింది. దీంతో పైలట్లు ముంబయి విమానాశ్రయంలో ప్రాధాన్య ప్రాతిపదికన ల్యాండింగ్‌ చేశారు. అలాగే, స్పైస్‌జెట్‌ బోయింగ్‌ 737 ఫ్రీటర్‌ (సరుకు రవాణాకు ఉపయోగించే కార్గో విమానం) కోల్‌కతా నుంచి చాంగ్‌కింగ్‌ (చైనా)కు బయల్దేరగా.. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానంఓల వెదర్‌ రాడార్‌ (వాతావరణ సూచీ) పనిచేయడంలేదని కమాండ్‌ పైలట్‌ గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి కోల్‌కతా మళ్లించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని