14 రోజులు.. 33లక్షల మందికి టీకాలు

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 33లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇతర దేశాలతో పోలిస్తే మనమే ముందున్నాం

Published : 30 Jan 2021 10:49 IST

ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో వేగంగా వ్యాక్సినేషన్‌

దిల్లీ: దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 33లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇతర దేశాలతో పోలిస్తే మనమే ముందున్నాం. 30లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయడానికి అమెరికా లాంటి దేశాలకు 18 రోజులు పట్టగా.. భారత్‌ కేవలం 14రోజుల్లోనే ఆ మార్క్‌ను చేరుకోవడం విశేషమని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

టీకా పంపిణీలో భాగంగా నిన్న దేశవ్యాప్తంగా మరో 4,40,681 మందికి వ్యాక్సిన్‌ వేశారు. దీంతో జనవరి 29 సాయంత్రం 7 గంటల నాటికి దేశంలో మొత్తంగా 33,68,734 మంది  టీకా తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు కేవలం 213 మందికి మాత్రమే టీకా వేయించుకున్నాక స్వల్ప దుష్ఫలితాలు ఎదురైనట్లు పేర్కొంది. కాగా.. భారత్‌లో కేవలం 14 రోజుల్లోనే 30లక్షల మందికి పైగా టీకాలు అందించడం విశేషం. ఇజ్రాయిల్‌లో 33 రోజులు, యూకేలో 36 రోజుల్లో 3 మిలియన్ల మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 

అత్యధికంగా యూపీలో..

టీకా పంపిణీ అత్యధికంగా జరిగిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ ముందుంది. శుక్రవారం నాటికి అక్కడ 4,31,879 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇక కర్ణాటకలో 3,07,752 మంది, మహారాష్ట్రలో 2,57,173, మధ్యప్రదేశ్‌లో 2,22,193, పశ్చిమ బెంగాల్‌లో 2,20,356, గుజరాత్‌లో 2,16,004, ఆంధ్రప్రదేశ్‌లో 1,77,856, కేరళలో 1,35,832, బిహార్‌లో 1,10,381 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

దేశంలో జనవరి 16 నుంచి టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్లు అందిస్తున్నారు. రెండో విడతలో 50ఏళ్లు పైబడిన, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50ఏళ్లులోపు వారికి టీకాలు ఇవ్వనున్నారు.

ఇవీ చదవండి..

బెడిసికొడుతున్న చైనా వ్యూహం!

కరోనాకు టీకానే ఆయుధం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని