‘దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా’

బిహార్‌ ప్రజలకు ఉచితంగా కరోనా టీకా అందజేస్తామన్న భాజపా ఎన్నికల హామీ రాజకీయ దుమారాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రతాప్‌ సారంగి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తానని ప్రకటించారని తెలిపారు..........

Published : 26 Oct 2020 10:25 IST

మోదీ ప్రకటించారన్న కేంద్ర మంత్రి సారంగి

బాలాసోర్‌: బిహార్‌ ప్రజలకు ఉచితంగా కరోనా టీకా అందజేస్తామన్న భాజపా ఎన్నికల హామీ రాజకీయ దుమారాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రతాప్‌ సారంగి ఆదివారం చేసిన కొన్ని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తామని ప్రకటించారని తెలిపారు. అందుకోసం ఒక్కో వ్యక్తికి రూ.500 కేటాయిస్తున్నారన్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరగనున్న ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  అక్టోబర్‌ 20న జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. దేశంలో పలు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని ప్రకటించిన విషయం తెలిసిందే. వాటి ఫలితాలన్నీ ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. 

అంతకుముందు టీకాపై బిహార్‌ ప్రజలకు భాజపా ఇచ్చిన హామీపై ఒడిశా మంత్రి ఆర్‌.పి.స్వెయిన్‌ అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, సారంగిలను వివరణ కోరారు. ఒడిశాలో వ్యాక్సిన్‌పై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు ఉచితంగా టీకా పొందే అవకాశం ఎందుకు లేదో తెలపాలని కోరారు. దీనిపై భాజపా వైఖరేంటో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు వివరించాలని డిమాండ్‌ చేశారు. దీనికి స్పందిస్తూనే.. దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా అందజేస్తామని సారంగి ప్రకటించారు. 

బిహార్‌లో అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా టీకా అందజేస్తామని భాజపా ప్రకటించగా.. తమిళనాడు, మధ్యప్రదేశ్‌, అసోం, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆయా రాష్ట్రాల ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సిన్‌ హామీని ఇచ్చాయి. ఇక దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకా అందజేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని