
బాబోయ్ చలి.. మద్యానికి జర దూరం: ఐఎండీ
దిల్లీ: చలి తీవ్రత పెరుగుతున్న వేళ మద్యపానానికి దూరంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో చలి తీవ్రత అధికంగా ఉందని, అందువల్ల ఇంట్లో లేదా కొత్త సంవత్సర వేడుకల్లో మద్యానికి దూరంగా ఉండటమే మేలని తెలిపారు. పంజాబ్, హరియాణా, దిల్లీ, యూపీ, నార్త్ రాజస్థాన్లలో డిసెంబర్ 28 నుంచి తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఫ్లూ, ముక్కుకారడం వంటి ఆరోగ్య ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్యపానం శరీర ఉష్ణోగ్రతలను మరింతగా తగ్గించి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, విటమిన్ సీ పుష్కలంగా ఉండే పండ్లు తినాలని సూచిస్తున్నారు. ఈ చలి తీవ్రతకు శరీరం పాడవ్వకుండా మాయిశ్చరైజర్లు వాడాలని సూచించారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో హిమపాతం కురిసే అవకాశం ఉందని, హిమాలయాల నుంచి వీచే చల్లని గాలులతో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు ఐదు నుంచి మూడు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.