అధికారంలోకి వచ్చాక పోలీసుల సంగతి చూస్తాం!

బెంగాల్‌ పోలీసులు ప్రజల కోసం పనిచేయడం లేదని, ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారని.. భాజపా అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని ఆ రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు రాజు బెనర్జీ...

Updated : 25 Nov 2020 13:58 IST

దుమారం రేపిన బెంగాల్‌ భాజపా ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు

కోల్‌కతా: బెంగాల్‌ పోలీసులు ప్రజల కోసం పనిచేయడం లేదని, ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారని.. భాజపా అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని ఆ రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు రాజు బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు రాష్ట్రంలో జరిగే నేరాలను అరికట్టకుండా కేవలం ప్రభుత్వ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. దుర్గాపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో రాజు బెనర్జీ మాట్లాడుతూ ‘పశ్చిమ బెంగాల్‌లో గుండా రాజ్యం సాగుతోంది. రాష్ట్రంలో జరిగే నేరాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాంటి పోలీసులను ఏం చేద్దాం? అధికారంలోకి వచ్చాక వారితో బూట్లు నాకిద్దాం’ అని అన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

బెంగాల్‌లో గత కొద్దిరోజులుగా భాజపా నేతలకు, మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వార్గియా సైతం మంగళవారం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా మహిళా నేత ఉన్నా.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఒక చట్టం నడుస్తుంటే బెంగాల్‌లో మాత్రం టీఎంసీ చట్టం నడుస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని