అందుకే 101 రోజులు ఆసుపత్రిలో..!

కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని కేంద్ర మాజీ మంత్రి భరత్‌సిన్హ్‌ సోలంకి అభిప్రాయపడ్డారు.

Published : 02 Oct 2020 00:46 IST

కేంద్ర మాజీ మంత్రి భరత్‌సిన్హ్‌ సోలంకి

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని కేంద్ర మాజీ మంత్రి భరత్‌సిన్హ్‌ సోలంకి అభిప్రాయపడ్డారు. ‘కరోనా వైరస్‌ వల్ల ఏమీ కాదనే అతి నమ్మకంతో వైరస్‌ను చాలా తేలికగా తీసుకున్నాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలందర్నీ కలవడం మొదలుపెట్టా. చివరకు వైరస్‌ బారినపడ్డాను’ అని సోలంకి పేర్కొన్నారు. ప్రస్తుతం 101 రోజుల తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైరస్‌ నుంచి అంత తేలికగా బయటపడలేదని.. చికిత్స సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ వైరస్‌ను తేలికగా తీసుకోకుండా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిపాలు కావడంకంటే మాస్కులు ధరించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని ప్రజలకు సూచించారు.

గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లా బొర్సాద్‌ పట్టణానికి చెందిన భరత్‌సిన్హ్‌ సోలంకి(66) గుజరాత్‌ పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్‌ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. జూన్‌ 22న ఆయనకు కొవిడ్‌-19‌ నిర్ధారణ కావడంతో వడోదరాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో అహ్మదాబాద్‌లోని సీఐఎంఎస్‌ ఆసుపత్రికి తరలించారు. 101రోజుల తర్వాత ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు.

కుటుంబ సభ్యులు, అభిమానుల ఆశీర్వాదంతో తాను కోలుకోని ఇంటికి చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన ప్రాణాలు రక్షించడంతోపాటు మెరుగైన చికిత్స అందించిన సీఐఎంఎస్‌ వైద్య సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని